హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నది. వారం నుంచి నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే పాజిటివిటీ రేటు స్థిరంగా పెరుగుతున్నది. కాకపోతే ఆందోళన చెందాల్సిన స్థాయిలో పెరుగుదల కనిపించటం లేదు. పాజిటివిటీ రేటు డిసెంబర్ 24న 0.46 శాతంగా ఉండగా, 31 నాటికి 0.84 శాతానికి పెరిగింది. రెండువారాల్లో మూడో వేవ్ మొదలవుతుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ రాష్ట్రంలోకి ప్రవేశించగా, డెల్టా ఇప్పటికీ మనుగడలో ఉండి తన ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కేసుల పెరుగుదల థర్డ్ వేవ్కు సంకేతమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు వచ్చే నాలుగైదు వారాలు ఎంత జాగ్రత్తగా ఉంటారు? అనే దానిపైనే ధన, ప్రాణనష్టం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నా, నష్టాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రజలదే. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు పాజిటివిటీ రేటు 10 శాతం దాటినా బెడ్ ఆక్యుపెన్సీ 40 శాతం దాటితే నైట్ కర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, బెడ్ ఆక్యుపెన్సీ ఒక్క శాతంలోపే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కలిపి దాదాపు 55 వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1,200 పడకలు మాత్రమే నిండాయి. అంటే ఆక్యుపెన్సీ రేటు కేవలం 0.21 శాతం మాత్రమే.
సంక్రాంతి పండుగను కుటుంబంతో సంతోషంగా జరుపుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు చేసుకొనేవారు భౌతికదూరం పాటించాలి. వేరియంట్ ఏదైనా మాస్క్, టీకాలు వజ్రాయుధాలు. టీకా వేస్తూ మా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇక ప్రజల వంతు. వచ్చే నాలుగైదు వారాలు మాస్క్లతో ముక్కు, మూతిని కట్టిపడేయండి.
-శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు