జనగామ, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. జనగామలో మాత్రం కలెక్టర్, పోలీస్ అధికారుల ప్రత్యేక రాజ్యాంగం అమలవుతున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. జిల్లా యంత్రాంగం అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం పోరాటయోధులు పుట్టిన జనగామగడ్డకు తీవ్ర అవమానమని పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన అధికారులతీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద తెలంగాణ సాయుధపోరాటం జనగామ గడ్డపై జరిగిందని గుర్తుచేశారు. దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న, చాకలి ఐలమ్మ పోరాటాల గడ్డమీద అంబేదర్ రాజ్యాంగం పనికిరాని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
అంబేదర్ జయంతి సమావేశంలో కలెక్టర్ ఎందుకు లేరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్వో, డీఈవో వంటి కీలక పదవులు ఒకేవ్యక్తి వద్ద ఉన్నాయని, త్వరలో డీసీపీ పోస్టు ఖాళీ అయితే ఆ బాధ్యతలు కూడా అదే వ్యక్తి తీసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవాచేశారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో రాజ్యాంగం అమలవుతుండగా, జనగామలో ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాట్లాడనీయడంలేదని చెప్పారు. జిల్లా కేంద్రంలో లిక్కర్ సిండికేట్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నదని, పట్టణంలో 11 వైన్స్ షాపులుంటే..25 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, డీసీపీ, ఏసీపీ కార్యాలయాల సమీపంలోనే బెల్ట్ షాపులు నడుస్తుంటే వాటిపై చర్యలు ఎందుకుతీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారంరోజుల్లో 25 బెల్ట్ షాపులు మూసివేయకుంటే దళిత, మహిళా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.