Pranahita | హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి 1.18 లక్షల క్యూసెక్కులకు వరద పోటెత్తగా మంగళవారం సాయంత్రానికి 2.34 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. కేవలం 24 గంటల వ్యవధిలో వరద రెండింతలు పెరగడం గమనార్హం. భారీగా వరద వస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీబరాజ్ వద్ద 35 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ బేసిన్లోని సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ వద్ద కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. తెలంగాణ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండటంతో వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. మరోవైపు కృష్ణా బేసిన్లో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ప్రవాహం మళ్లీ మొదలై క్రమంగా పెరుగుతున్నది. సోమవారం సాయంత్రం కర్ణాటక లోని ఆల్మట్టికి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం నాటికి 18 వేలకు చేరింది. తుంగభద్రకు 11 వేల క్యూసెక్కుల వరద మొదలైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్నది.
కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు
ఎస్సారెస్పీకి ఎత్తిపోతలను నిలిపివేసినా, లక్ష్మీబరాజ్ నుంచి రాజరాజేశ్వర జలాశయానికి, అక్కడి నుంచి ఎల్ఎండీకి కాళేశ్వరం జలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మూసీ నీటిసి విడుదల చేసిన చిరుమర్తి
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం నీటిని విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రెండు కాల్వలకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.