హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాస్తవాలకు మసిబూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. లేని బంధుత్వాలు అంటగట్టడంలో సిద్ధహస్తుడు. నోరు తెరిస్తే చాలు.. నాలుక మడతలు పడి, ఇష్టంవచ్చినట్టు మెలికలు తిరిగిపోతుంది. కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డికి సంబంధించిన ఈ గొప్పతనాలు గురువారం ఆయన మాటల్లోనే బయటపడ్డాయి. దేవరయాంజాల్ దేవాదాయ భూములపై జరుగుతున్న విచారణ విషయంలో ఆయన వక్రీకరణలు.. ఆయన కుట్రల బుద్ధిని చాటుతున్నాయి. రేవంత్రెడ్డి చెప్పిన అబద్ధాలు.. అసలు వాస్తవాలను గమనిస్తే ఆయన మరో గోబెల్స్ అని తేలిపోతుంది.
రేవంత్ అబద్ధం: దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రఘునందన్రావు ముఖ్యమంత్రి కేసీఆర్కు సమీప బంధువు.
వాస్తవం: ముఖ్యమంత్రి కేసీఆర్కు, దర్యాప్తు అధికారి రఘునందన్రావుకు మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.
రేవంత్ అబద్ధం: డిఫెన్స్ ప్రాంతంలో ఇక్కడ 50 అడుగుల ఎత్తులో
నమస్తే తెలంగాణ గోదాములు నిర్మాణం చేశారు. ఇది చట్ట విరుద్ధం.
వాస్తవం: పచ్చి అబద్ధం. రక్షణశాఖ నిబంధనల మేరకే ఇక్కడ నిర్మాణాలు చేశారు.
ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు.
రేవంత్ అబద్ధం: దేవుడి భూముల్లోనే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. 10-15 ఎకరాల భూమిలో ఉన్నాయి.
వాస్తవం: ఇది మరో పెద్ద అబద్ధం. సర్వే నంబర్ 437 దేవరయాంజాల్ మాన్యం భూమికాదు. ఇది బాజాప్తా పట్టాభూమి. దశాబ్దాల రికార్డులన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా చూసుకోవచ్చు. పహాణీలున్నాయి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్కు ఉన్న మొత్తం భూమి 4 ఎకరాల 14 గుంటలు మాత్రమే.
రేవంత్ అబద్ధం: అధికారులు ఇక్కడ తిరగడంలేదు. పదెకరాలల్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రింటింగ్ యూనిట్లు ఉండటంతోనే రావడంలేదు.
వాస్తవం: ప్రస్తుతం పట్టా భూముల్లో విచారణ జరుగడంలేదు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ప్రింటింగ్ యూనిట్ల స్థలం ముమ్మాటికీ పట్టాభూమి. పత్రిక కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులను యాజమాన్యం ఎప్పుడో తీసుకున్నది. వీటికి తొలుత అనుమతులు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అనుమతులన్నీ 2010-11 సంవత్సరంలోనే వచ్చాయి. ప్రభుత్వం దేవరయాంజాల్లో శ్రీసీతారామచంద్రస్వామి మాన్యానికి సంబంధించి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించాలనే ఉద్దేశంతోనే నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.
రేవంత్ అబద్ధం: మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 111 జీవో పరిధిలోని భూముల్లో అక్రమాలు చేశారు.
వాస్తవం: మంత్రి కేటీఆర్కు ఎక్కడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. రేవంత్రెడ్డి రాజకీయ కక్షతో ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై గతంలోనే మంత్రి కేటీఆర్ పత్రికాముఖంగా ప్రకటించారు. 111 జీవోలో ఒక ఇంటికి సంబంధించి రేవంత్రెడ్డి న్యాయస్థానాల్లో వేసిన కేసులపై మంత్రి కేటీఆర్ బాజాప్తా అఫిడవిట్ దాఖలు చేశారు.
రేవంత్ అబద్ధం: దేవరయాంజాల్లో వెలిసిన అక్రమ కట్టడాలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ల ఫెయిల్యూర్.
వాస్తవం:తెలంగాణ ప్రభుత్వం రాక ముందే ఇక్కడ అనేక నిర్మాణాలు వచ్చాయి. ముఖ్యమంత్రి దృష్టికి విషయం రావడంతోనే విచారణకు ఆదేశించారు. బాజాప్తా విచారణ జరుగుతున్నది. బహిరంగ విచారణనే నడుస్తున్నది. విచారణ పూర్తి కాకముందే నిజనిర్థారణ పేరుతో రేవంత్రెడ్డి హడావుడి చేయడంపై సొంతపార్టీవాళ్లే గుసగుసలు పెడుతున్నారు. ఆయన తన బినామీలను, అనుచరులను తప్పించేందుకే ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటిపైనా విచారణాధికారులు లోతుగా పరిశీలన జరుపుతున్నారు. నివేదిక రాకముందే రేవంత్రెడ్డి హడావుడి చేయడంలో ఆంతర్యమేంటి? కేవలం రాజకీయంగా మంత్రి కేటీఆర్పై బురదజల్లడమే లక్ష్యంగా రేవంత్ మాట్లాడుతున్నారు. మంత్రిగా కేటీఆర్ పురపాలకశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఆ శాఖలో పారదర్శకత పెరిగిందని, అవినీతి తగ్గిందని అనేకమంది పారిశ్రామికవేత్తలు అనేక వేదికలపై చెప్పారు.