సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి (నవంబర్ 28): ‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం భవననంలోని, పుస్తకాలు, కంప్యూటర్లను పరిశీలించారు. కేసీఆర్నగర్లో స్థానికుల సౌకర్యం కోసం ‘నమస్తే తెలంగాణ’ సహకారంతో అధునాతన గ్రంథాలయం నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నదని, ఉద్యోగార్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
విజ్ఞానం పొందాలంటే ఇలాంటి గ్రంథాలయాలతోనే సాధ్యమన్నారు. ఇకపై గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు మున్సిపాలిటీ తీసుకుంటుందని, పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో అధునాతన గ్రంథాలయం నిర్మించి పుస్తకాలు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడంపై మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, డీఎంహెచ్వో కాశీనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నమస్తే తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ సతీశ్, ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో చీఫ్ శ్రీనివాస్రెడ్డి, నమస్తే తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు.
సకల సదుపాయాలతో లైబ్రరీ
పుస్తక పఠనం ద్వారా ఏదైనా సాధించవచ్చననే ఉద్దేశంతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక యాజమాన్యం సామాన్య ప్రజలకు చేరువలో గ్రంథాలయాన్ని నిర్మించాలని సంకల్పంచి సిద్దిపేటలోని కేసీఆర్నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద రూ.70 లక్షలతో నిర్మించింది. 1,450 చదరపు అడుగుల స్థలంలో ఆధునిక హంగులతో లైబ్రరీని ఏర్పాటు చేసింది. ‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో బాలవికాస, పౌలోమి కంపెనీ ఆధునిక సౌకర్యాలతో ఈ గ్రంథాలయాన్ని పూర్తి చేశారు.
లైబ్రరీ, కంప్యూటర్ రూంతో పాటు మల్టీపర్పస్ హాలు, కోర్టు యార్డు నిర్మించారు. మల్టీపర్పస్ హాల్లో 50 నుంచి 80 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి వీలుంది. లైబ్రరీలో బీరువాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీతో పాటు ఇతర పబ్లికేషన్లకు సంబంధించిన దాదాపు 750 పుస్తకాలను లైబ్రరీలో అందుబాటులో ఉంచారు.