న్యూఢిల్లీ, జూలై 17: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ), సీఎం కేజ్రీవాల్ సర్కార్కు మధ్య ‘రాజకీయ వైషమ్యాలు, తగాదాలు’ పతాక స్థాయికి చేరుకున్నవేళ..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్జీ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ ఇద్దరూ రాజకీయ తగాదాలు పక్కకుపెట్టాలని, సంయుక్తంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (డీఈఆర్సీ) చైర్పర్సన్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఆప్ సర్కార్ దాఖలుచేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. తగాదాల్లో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ‘ఎల్జీ, సీఎం ఇద్దరూ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు. రాజకీయ వైషమ్యాలు, తగాదాలు పక్కకుపెట్టి, కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొన్నది. పిటిషన్ విచారణను జూలై 20కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
రాజ్యాంగ బెంచ్కు ‘ఢిల్లీ’ ఆర్డినెన్స్ కేసు!
ఢిల్లీలో అధికారులపై నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన సవాల్ పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసే యోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టు సోమవారం సూచనప్రాయంగా పేర్కొన్నది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 20కు వాయిదా వేసింది.