ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. సాధన కమిటీ సభ్యులు గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా వద్ద హైదరాబాద్-ఆదిలాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్, కమిటీ సభ్యులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జాతీయ రహదారిపై బైఠాయించి, ధూంధాం నిర్వహించారు. రెండు గంటలపాటు చేపట్టిన ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాత బకాయిలు చెల్లిస్తే.. ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తుందని సాధన కమిటీ సభ్యులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించినట్టు తెలిపారు. సీసీఐ సాధన ప్రజా ఉద్యమంగా మారిందని, కేంద్రం మెడలు వంచి సీసీఐని తెరిపించుకొంటామన్నారు. సీసీఐని పునఃప్రారంభిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ జిల్లాలో ఆందోళనలు జరిగినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.