కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) సరికొత్త ప్యాకేజీలను తీసుకొచ్చింది. కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కనిపిస్తున్న నేపథ్యంలో మరింతమందిని ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఇటీవలే తిరుపతికి రెండు రోజుల విమాన టూర్ను ప్రారంభించగా విశేష స్పందన లభిస్తున్నది. నాలుగు రోజుల్లో రోజూ 20 మంది చొప్పున ఈ ప్యాకేజీని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల కోసం టీఎస్టీడీసీ మరో మూడు మినీ ఏసీ బస్సు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
-హైదరాబాద్, నమస్తే తెలంగాణ
కొమురవెల్లి, వేములవాడ, కొండగట్టును ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో మినీ ఏసీ బస్సు బయలుదేరి 11 గంటలలోగా కొమురవెల్లికి చేరుకొంటుంది. దర్శనం తర్వాత అల్పాహారం ఏర్పాటుచేస్తారు. 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 మధ్యలో వేములవాడకు తీసుకెళ్లి దర్శనం చేయించి భోజనం పెడుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలలోగా కొండగట్టు దర్శనం పూర్తిచేయిస్తారు. సాయంత్రం 4 గంటలకు బస్సు బయల్దేరి రాత్రి 8 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. పెద్దలకు రూ.1200, పిల్లలకు రూ.960 చార్జి చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కొండపోచమ్మ-వేములవాడ-కొండగట్టుకు ఒక రోజు ప్యాకేజీ తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్కు చేరుస్తారు. మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు కొమురవెల్లికి, అక్కడి నుంచి మధ్యాహ్నం 2గంటలకు వేములవాడకు తీసుకెళ్తారు. దర్శనం పూర్తయ్యాక 4 గంటలలోపు భోజనం ఉంటుంది. అక్కడి నుంచి 5 గంటలకు కొండగట్టు తీసుకెళ్లి 6 గంటలలోపు దర్శనం చేయిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుస్తారు. పెద్దలకు రూ.1799, పిల్లలకు రూ.1439 చార్జి చేస్తున్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం ఒక రోజు ప్యాకేజీని టీఎస్టీడీసీ తీసుకువచ్చింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో మొదలై 10.30 గంటలకు కొలనుపాక జైన్ టెంపుల్కు తీసుకెళ్తారు. 11.30కు అక్కడ బయలుదేరి 12.30కు యాదగిరిగుట్టలోని లోటస్ టెంపుల్ చూపిస్తారు. 1.30 నుంచి 2.30 మధ్యలో భోజనం చేశాక 2.30కు యాదాద్రి ప్రధాన దేవాలయానికి తీసుకెళ్లి 4.00 గంటలలోగా దర్శనం చేయిస్తారు. సాయంత్రం 4.30-7.30 మధ్యలో సురేంద్రపురి (కళాధామం) చూపించి రాత్రి 9.30 గంటలకు తిరిగి హైదరాబాద్ తీసుకొస్తారు. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.1499, పిల్లలకు రూ.1199.