మహబూబ్నగర్ : రాష్ట్రంలో అన్ని కులాలు, మతాల వారు సమానంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం రాజా బహదూర్ వెంకట రామి రెడ్డి 153 వ జయంతిని పురస్కరించుకొనిజిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న వెంకట రామి రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజాం కాలంలో కొత్వాల్( పోలీస్ కమిషనర్) గా పనిచేసిన రాజా బహదూర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాయినిపేట లో జన్మించడం మనకు గర్వకారణమని అన్నారు.
ముఖ్యంగా పేదలు చదువుకోవాలని, విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ రెడ్డి హాస్టల్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. రెడ్డి హాస్టల్లో సేవలు అందిస్తూనే అన్ని కులాల వారు చదువుకోవాలని ఆకాంక్షించారని తెలిపారు. రెడ్డి హాస్టల్ ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్లు, మేధావులను తీర్చిదిద్దిందని, అంతేకాక సురవరం ప్రతాపరెడ్డి లాంటి వారిని ముందుకు నడిపించిన రెడ్డి హాస్టల్లో సేవలందించిన మహా వ్యక్తి అని కొనియాడారు.
హైదరాబాద్ రెడ్డి హాస్టల్ స్ఫూర్తితో మహబూబ్నగర్లో పాలమూరు రెడ్డి సేవ సమితి ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ ను స్థాపించినట్లు తెలిపారు. దీని ద్వారా 70శాతం బడుగు, బలహీన వర్గాల పిల్లలందరికి విద్యావకాశాలు కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. అదేవిధంగా ఇటీవల గౌడ హాస్టల్ను కూడా స్థాపించేందుకు గౌడ కులస్తులు ముందుకు రాగా గౌడ హాస్టల్ ద్వారా కూడా అన్ని కులాల వారికి అవకాశాలు కల్పించాలని తాను సూచించినట్లు పేర్కొన్నారు.
అన్ని కులాలు, మతాల వారు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో కుల రహిత సామ్రాజ్యం నిర్మాణమే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మన్నే శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కె. సి. నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, రెడ్డి సేవా సమితి నాయకులు చిన్నారెడ్డి, మల్లు నరసింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ధనం జయ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి , కౌన్సిలర్లు విఠల్ రెడ్డి, రవి కిషన్ రెడ్డి, అనంతరెడ్డి, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ హీరోయిన్ నాన్స్టాప్గా 48 గంటలు పడుకుంటుందట..!
Polio Vaccination: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన అందరికీ ఫ్రీగా పోలియో వ్యాక్సిన్
తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల స్కూలు రికార్డులు దగ్ధం