కాబూల్: తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల రికార్డులను స్కూల్ వ్యవస్థాపకురాలు తగులబెట్టారు. బాలికలు, వారి తల్లిదండ్రుల వివరాలు తాలిబన్లకు తెలియకుండా ఉండేందుకు ఈ పని చేసినట్లు తెలిపారు. స్కూల్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ఘనిస్థాన్ పేరుతో షబానా బసిజ్-రసిక్ కేవలం బాలికల కోసం బోర్డింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో వారి వివరాలు తెలియకుండా ఉండేందుకు రికార్డులను కాల్చివేసినట్లు ట్వీట్ చేశారు.
గతంలో తాలిబన్లు విద్యార్థినుల ఉనికి లేకుండా చేసేందుకు వారి స్టడీ రికార్డులను నాశనం చేశారని, తాను కూడా ఒక బాధితురాలినని గుర్తు చేశారు. తాలిబన్ల పతనం తర్వాత 2002లో ఆఫ్ఘన్ మహిళలకు కొత్త అవకాశాలు వచ్చాయని, దీంతో టెస్ట్ ద్వారా పబ్లిక్ స్కూల్లో చేరి ఉన్నత విద్యనభ్యసించినట్లు తెలిపారు. అనంతరం బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బోర్డింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అయితే 20 ఏండ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి రావడంతోపాటు షరియా చట్టం విధించడంతో మహిళల్లో భయాందోళన వ్యక్తమవుతున్నదని షబానా అన్నారు. తాను, కొంత మంది విద్యార్థినులు, ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నప్పటికీ దేశంలోని చాలా మంది మహిళల పరిస్థితి దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలికలు, వారి తల్లిదండ్రుల వివరాలు తాలిబన్ల చేతికి చిక్కకుండా సంబంధిత రికార్డులను మాత్రమే తగులబెట్టినట్లు ఆమె ట్వీట్ చేశారు.
అయితే ఆఫ్ఘన్లో తిరిగి మంచి రోజులు రావచ్చని షబానా ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ఆఫ్ఘన్ బాలికల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యకు పెట్టుబడులు పెడతానని వెల్లడించారు.
Nearly 20 years later, as the founder of the only all-girls boarding school in Afghanistan, I’m burning my students’ records not to erase them, but to protect them and their families.
— Shabana Basij-Rasikh (@sbasijrasikh) August 20, 2021
2/6 pic.twitter.com/JErbZCSPuC