Gurukula Society | హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీలు నిర్వహించవద్దని, విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అడ్మిషన్లు కూడా చేపట్టవద్దని ఇంటర్మీడియట్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు కాలేజీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా జేఈఈ, నీట్ శిక్షణ పేరిట తరగతులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయి.
సాంఘిక సంక్షేమ గురుకులాలు కూడా ఇప్పుడిదే కోవలోకి చేరాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిస్తుండడమే కాకుండా ప్రైవేటు కాలేజీల తరహాలోనే సమర్థించుకోవడం గమనార్హం. నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైనంపై ‘గురుకులాల రూటే సపరేటు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి స్పందించిన తీరు ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
మార్చి 7నే ఆదేశాలు
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లోని ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మార్చి13 నుంచి మే 15 వరకు ఇంటర్ సెకండియర్ సిలబస్ తరగతులు నిర్వహించాలని, దసరా నాటికి సిలబస్ పూర్తి చేయాలని మార్చి 7న సీతాలక్ష్మి ఆదేశాలు జారీచేశారు. ఇంటర్ సెకండియర్ పూర్తిచేసిన విద్యార్థులకు జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వాలంటూ సీవోఈ ప్రిన్సిపాల్స్కు మార్గదర్శకాలు జారీచేశారు.
ఇప్పుడేమో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసిన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న విషయాన్ని మరుగున పరచి, సెకండియర్ విద్యార్థులకు మాత్రమే నీట్, జేఈఈ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. సెకండియర్ విద్యార్థులకు నీట్, జేఈఈ శిక్షణ ఓకే కానీ, ఫస్టియర్ విద్యార్థులకు తరగతులేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడమేంటని నిలదీస్తున్నారు. ఇలా విరామం ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తే వారిలో ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నారు. ఈ కారణంగానే గురుకులాల్లోనూ విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు.
విద్యార్థుల ఇష్టంతోనే..
‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఇష్టంతోనే తరగతులు నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. మేలో జరగనున్న జేఈఈ, నీట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తరగతులకు హాజరవుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు.