హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘నింగి వానగట్టు నేల కుంగినట్టు.. పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో.. సెరువోయి.. మా ఊరి సెరువు.. ఊరి బరువునంత మోసే ఏకైక ఆదెరువు..’ అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెటి వెంకన్న చక్కగా వర్ణించారు. కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు సమైక్యపాలనలో పూర్తిగా విధ్వంసం అయ్యాయి. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు. ఫలితంగా మండుటెండల్లోనూ చెరువులు మత్తడులు దుంకాయి. యాసంగి సీజన్లోనూ పంటలకు భరోసా లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చెరువులన్నీ కళతప్పాయి. ప్రాజెక్టుల్లో నీటిని వదలకపోవడంతో చెరువులు ఎండిపోయి నెర్రలు పారాయి.
ప్రాజెక్టుల్లో నీటి కొరత కారణంగానే కాలువల్లో నీటి విడుదల చేయలేదని సర్కారు సాకు చూపిస్తున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి ఎస్సారెస్పీలో 78.66 టీఎంసీలు, మిడ్మానేరులో 23 టీఎంసీలు, ఎల్ఎండీలో 19.42 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 16.03 టీఎంసీలు, సింగూరులో 25.81 టీఎంసీలు, నిజాంసాగర్లో 16.16 టీఎంసీలు, కడెంలో 4.3 టీఎంసీలు, శ్రీశైలంలో 57టీఎంసీలు, నాగార్జునసాగర్లో 157 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయి. అందులో కొద్దిమేర నీటితోనైనా ఆయా ప్రాజెక్టుల పరిధిలోని చెరువులను కనీసం 50శాతం నింపినా ఈ రోజు కరువు కోరల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి తలెత్తి ఉండేదని కాదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తమతో చర్చించింది కూడా లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. అదే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది దాదాపు 9 టీఎంసీలను లిఫ్ట్ చేయడంతోపాటు, ఆ ప్రాజెక్టు పరిధిలోని చెరువులను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిమేర నింపింది. ఇటీవల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మల్లన్నసాగర్, రంగానాయకసాగర్ పరిధిలోని చెరువులకు, చెక్డ్యామ్లకు నీళ్లను వదిలింది.
అడుగంటిన జలాలు
రాష్ట్రవ్యాప్తంగా 34,712 చెరువుల్లో ఏకంగా 23,211 చెరువుల్లో జలాలన్నీ అడుగంటిపోయాయి. 7592 చెరువుల్లో 50శాతం కంటే తక్కువ నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన చెరువుల్లోనే కొద్దిమేర జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్గొండ, కామారెడ్డి, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్ ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 90శాతం చెరువులు దాదాపు అడుగంటి పోయాయి. మిగతా ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని చెరువుల్లోనూ కొద్దిమేర మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి.
బోర్లన్నీ ఫెయిల్..
గొలుసుకట్టు చెరువులను వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న క్రమంలోనే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ బోరుబావుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు నాటికి దాదాపు 20లక్షల బోరుబావులుండగా వాటి కింద సాగయింది మాత్రం 23లక్షల ఎకరాలు మాత్రమే. అది కూడా ఎప్పుడూ స్థిరంగా ఉన్నది లేదు. వానలు పడినా ఎండిపోవాల్సిన దుస్థితి. తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ అమలు చేస్తున్న బహుముఖ జలసంరక్షణ చర్యల ఫలితంగా బోరుబావుల కింద వ్యవసాయం కూడా పండుగలా మారింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 1.10 కోట్ల ఎకరాలు సాగువగా అందులో దాదాపు 45లక్షల ఎకరాలు 30లక్షల బోర్లు కిందనే సాగయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఏడాది చెరువులను నింపకపోవడం వల్లే బోర్లన్నీ ఫెయిలవుతున్నాయని రైతులు వివరిస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి కూడా అదే ప్రధాన కారణమని అర్థమవుతున్నది. మొత్తంగా ఇదీ ప్రభుత్వ అవగాహన రాహిత్యం ఫలితంగానే కరువు దాపురించిందనే స్పష్టంగా తెలిసిపోతున్నది.
చెరువుల్లో నీటి నిల్వ లెక్కఈ ఏడాది మార్చి30 నాటికి చెరువుల్లో నీటి నిల్వ శాతం గత ఏడాది మార్చి