Leopard | వనపర్తి : వనపర్తి జిల్లాలో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్లు పేర్కొన్నారు.
అయితే చిరుత ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసుకునేందుకు ఆ ఏరియాలో అక్కడక్కడ రెండు, మూడు సెల్ఫోన్లను అమర్చారు. అయితే గొర్రెల కాపరి జంగం రాములు.. ఎర్రకుంటలో అమర్చిన సెల్ఫోన్కు చిరుత దృశ్యాలు చిక్కాయి. గురువారం సాయంత్రం చిరుత ఓ మేకపిల్లను ఎత్తుకెళ్లి చంపిన దృశ్యాలు ఆ ఫోన్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో పశువుల, గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.