రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, ఒక పిల్లను చిరుత తీసుకు వెళ్తుండగా తెల్లవారుజామున పొలం పనులకు వెళ్తున్న ఓ రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు.
దీంతో అక్కడ ఉన్న ఆ చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చి..చిరుత పిల్లతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి వచ్చి, ఆ చిరుత పిల్లను కరీంనగర్ తరలిస్తామన్నారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.