ఘనంగా శతజయంతి ఉత్సవాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు
అధికారికంగా వేడుకలు
కరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల
16 ఫీట్ల విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
కార్పొరేషన్, జూన్ 28;భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై పీవీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కీర్తించారు. కరీంనగర్లో మంత్రి గంగుల పాల్గొని, తెలంగాణచౌక్ సమీపంలోని మల్టీపర్పస్ స్కూల్ పార్క్లో రూ.45 లక్షలతో 16 ఫీట్ల విగ్రహ ఏర్పాటు కోసం మేయర్ సునీల్రావుతో కలిసి భూమి పూజ చేశారు.
కీర్తిని చాటేలా భారీ విగ్రహంభారతదేశం గర్వించేలా తెలంగాణ ప్రభుత్వం పీవీ నరసింహారావు భారీ కాంస్య విగ్రహాన్ని నెక్లెస్ రోటరీలో ఏర్పాటు చేసింది. 2 టన్నుల బరువు, 26 అడుగుల ఎత్తులో అత్యంత ఆకర్షణీయమైన ఈ విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
నెక్లెస్రోడ్ను పీవీ మార్గ్గా నిర్ణయించిన విషయం తెలిసిందే.
తెలంగాణ తేజం, తెలుగుకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు సోమవారం పరిసమాప్తమయ్యాయి. గతేడాది జూన్ 28న పీవీని స్మరిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏడాదిపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయినప్పటికీ..పీవీ ఘనతను చాటేలా తెలంగాణలోనే కాకుండా జాతీయ,అంతర్జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. శతజయంతి ఉత్సవ కమిటీ తరఫున పీవీ ఘనతను చాటే పుస్తకాలను కూడా ముద్రించారు. పీవీ రచనలు, ఆయన రాసిన అరుదైన 8 కథల సంకలనం, వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలు, పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై ప్రసంగాల సంకలనం..ఆయా సందర్భాల్లో పీవీని పలు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూలు, పీవీ పాలన, ఆర్థిక సంస్కరణలు, అగ్రనాయకులు రాసిన వ్యాసాల సంకలనం, ఆయన స్ఫూర్తితో 125కు పైగా అంతర్జాతీయ,జాతీయ, రాష్ట్ర కార్టూనిస్టులు వేసిన క్యారికేచర్ల సంకలనం, పీవీ జీవితచరిత్రపై వెలిజాల చంద్రశేఖర్ రాసిన పుస్తకం, ‘నమస్తే పీవీ’ పేరుతో పీవీ నరసింహారావు గురించి ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం, కాలాతీతుడు పేరుతో 43 మంది కవుల కవితా సంకలనాలను సోమవారం పీవీమార్గ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు.