హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వవిప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సింగరేణి కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, కార్మికుల వారసుల ఉద్యోగాల విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను సింగరేణి సీఎండీతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.