KTR | కల్వకుర్తి : నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ఆ పార్టీ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ప్రసంగించారు.
ఐపీఎస్ ఆఫీసర్.. విజ్ఞానవంతుడు.. ఒక అధికారిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి. 1000 గురుకులాలను కేసీఆర్ ప్రారంభిస్తే.. వాటిని సమర్థవంతంగా నడిపిన మొనగాడు ఆర్ఎస్పీ. ఇలాంటి అభ్యర్థి నాగర్కర్నూల్కు మళ్లీ దొరకడు. ఆయన పార్లమెంట్లో అడుగు పెడితే మన గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులు బొచ్చెడు మంది ఉంటారు. పైసలు ఉన్నోళ్లు రాజకీయాల్లోకి వస్తుంటారు. ఒక పేద కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని ఐపీఎస్ అయిన వ్యక్తి ఆర్ఎస్పీ. ఐపీఎస్ ఆఫసీర్గా ఏడేనిమిదేండ్ల సర్వీసు ఉన్నాకూడా అది వదిలిపెట్టి ప్రజా సేవం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయినా మన కోసం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో బంపరాఫర్లు ఆర్ఎస్పీకి ఇచ్చింది.. ఎంపీ చేస్తాం, టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తాం. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని చేస్తామని ఆశ చూపెట్టిన అవేవి పట్టించుకోకుండా మనం కోసం బీఆర్ఎస్లోకి వచ్చారు అని కేటీఆర్ తెలిపారు.
గతంలో కల్వకుర్తిలో ఏమైనా పొరపాట్లు జరిగితే మనసులో నుంచి తీసేయండి. ఇవాళ అద్భుతమైన అభ్యర్థి వచ్చిండు. కలిసొచ్చే కాలకానికి నడిచొచ్చే కొడుకు వచ్చిండన్నట్టు ఆర్ఎస్పీని గెలిపించండి. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. రేవంత్ రెడ్డి ఒకటే అంటడు. రుణమాఫీ చేయకున్నా, రూ. 2,500 ఇవ్వకున్నా, రూ. 4 వేల పెన్షన్ ఇవ్వకున్నా, స్కూటీలు ఇవ్వకున్నా నాకే ఓటేశారు.. ఇంకా వాళ్లకు ఏ పథకం అమలు చేయకున్న సరిపోతది అని రేవంత్ అన్ని బంద్ పెడుతారు. కాబట్టి ఆలోచించి ఆర్ఎస్పీని గెలిపించండి అని కేటీఆర్ విజ్ఞఫ్తి చేశారు.