Dharmapuri Arvind | కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. ముస్లింలంతా కాంగ్రెస్కు ఓటెయ్యాలని సిమి ( స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా ) ప్రకటించిందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు.
ఈ ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నిషేధిత సంస్థ సిమిపై 15 టెర్రరిస్ట్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమికి కాంగ్రెస్ మాతృసంస్థగా మారిందని విమర్శించారు. ఆ రెండు సంస్థలు కూడా కాంగ్రెస్కు ఫండింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలే కంట్రోల్ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా, బోధన్ నకిలీ పాస్పోర్టులకు అడ్డాగా మారిందని అన్నారు.