KTR | కల్వకుర్తి : బీజేపీ పాలనలో నిత్యవసరాల ధరలన్నీ పెరిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర రూ. 5 వేలు అయితదని కేటీఆర్ పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ప్రసంగించారు.
మహబూబ్నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా జలాల్లో వాటా తేల్చలేదు మోదీ. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదు. అయినా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు. రాముడికి గుడి కట్టామని ఓట్లు వేయమని అడుగుతున్నారు. కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి కట్టలేదా..? మనం యాదాద్రిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగలేదు. కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల కట్టారు. చెరువులను బాగు చేశారు. ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లే పెట్టారు. ఒక్క గుడి కట్టినందుకు మోడీకి ఓటు వేయాలంటున్నారు. మరి యాదాద్రితో పాటు ఎన్నో ప్రాజెక్టులు కట్టి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టిన కేసీఆర్కు ఎన్నిసార్లు ఓటేయాలో ఆలోచించుకోండి.
మన రాజ్యాంగాన్ని ఎత్తి అవతల పడేస్తాం అని బీజేపోళ్లు అంటున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈసారి మోదీ గెలిస్తే 400 సీట్లు వచ్చుడేమో కానీ.. పెట్రోల్, డిజీల్ ధరలు రూ. 400కు పెరగడం ఖాయం. మళ్లా ఒక్కసారి పొరపాటున బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర 5 వేలు అవుతుది. ఆ తర్వాత మీ ఇష్టం. రూ. 400 ఉన్న సిలిండర్ను రూ. 1200 చేసిండు. లీటర్ పెట్రల్ రూ. 60 ఉంటే.. దాన్ని రూ. 105కు పెంచిండు. ఇప్పుడు గనుక బీజేపీని గెలిపిస్తే ఈ ధరలు మళ్లీ పెరగడం ఖాయం. పేద ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.