Paytm | పేటీఎం బ్రాండ్ పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒత్తిడికి గురవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.317.45లతో మరో ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ఫిబ్రవరి 15 నాటి పేటీఎం షేర్ విలువ రూ.318.35 కంటే దిగువకు పడిపోయింది. దీంతో బుధవారం మధ్యాహ్నం పేటీఎం షేర్ ను ఫ్రీజ్ చేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పేటీఎం ప్రెసిడెంట్ కం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భావిష్ గుప్తా రాజీనామా చేయడంతో వరుసగా మూడో రోజూ పేటీఎం షేర్ లోయర్ సర్క్యూట్ను తాకింది.
ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత గత కొన్ని నెలల్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో భవీష్ గుప్తా రాజీనామా మూడవది. గత మూడు రోజుల్లో పేటీఎం షేర్ 14 శాతం పతనమైంది. గతేడాది అక్టోబర్ 20న పేటీఎం షేర్ రూ.998.30లతో 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 68 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయినప్పుడు 2021 నవంబర్ 18న పేటీఎం షేర్ రూ.1961.05లతో రికార్డు నమోదు చేసింది. షేర్ విలువ రూ.2,150 వద్ద షేర్ల విక్రయంతో పేటీఎం రూ.18,300 కోట్ల నిధులు సేకరించింది. ఇదిలా ఉంటే ఈ నెల నాలుగో తేదీన భవిష్ గుప్తా చేసిన రాజీనామాను పేటీఎం డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ నెల 31 నుంచి భవిష్ గుప్తా రాజీనామా అమల్లోకి వస్తుంది.