న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోసం జైలులో కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్కు లక్ష జరిమానా విధించింది. జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన సాగించేందుకు, కేబినెట్ మంత్రులతో వర్చువల్గా కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు వీలుగా సీఎం కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని, ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని న్యాయవాది శ్రీకాంత్ ప్రసాద్ ఢిల్లీ హైకోర్టును కోరారు. దేశ రాజధానిలో ప్రస్తుత పరిస్థితులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే సీఎం కేజ్రీవాల్ రాజీనామా కోసం ఒత్తిడి, దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించడం గురించి సంచలనాత్మక వార్తల కవరేజ్ నుంచి మీడియా సంస్థలను నిరోధించాలని ఆ పిటిషన్లో కోరారు.
కాగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆ పిల్పై బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్పై తీవ్రంగా మండిపడింది. ‘మేం ఏం చేయాలి? ఎమర్జెన్సీ విధించాలా? సెన్సార్షిప్ లేదా మార్షల్ లా విధించాలా? పత్రికలు, రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఆదేశాలు ఎలా జారీ చేస్తాం?’ అని కోర్టు ప్రశ్నించింది. ఈ పిల్ను తిరస్కరించడంతోపాటు పిటిషనర్కు లక్ష జరిమానా విధించింది. ఈ డబ్బును ఎయిమ్స్లో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.