మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 15 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని చిన్న మసీదులో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ పాల్గొన్నారు.