హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ జనాదరణ పెరుగుతున్నది. పార్టీ సిద్ధాంతాలు, అధినేత సీఎం కేసీఆర్ పాలనపట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నది. పలు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరడానికి ముందుకొస్తున్నారు. శనివారం ప్రగతిభవన్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని ఆహ్వానించిన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు.. దేశ రాజకీయాల్లో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం ఎంతో అవసరం అన్నారు. బీఆర్ఎస్లో చేరడానికి సంసిద్ధత తెలిపారు. ఛత్తీస్గఢ్కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్సింగ్ భగత్, మహారాష్ట్ర భండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి డాక్టర్ ఛబీలాల్ రౌత్రాయ్, గడ్చిరోలి జడ్పీ మాజీ చైర్మన్ పసుల సమ్మయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకుడు అంబటి బాలచంద్రగౌడ్ తదితరులు సీఎంతో భేటీ అయ్యారు.
అర్జున్దాస్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం
బీఆర్ఎస్ పార్టీ ఒడిశా నేత, మాజీ ఎమ్మెల్యే అర్జున్ దాస్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.