హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఈ విషయంలో రాజీలేదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. పోలీసు శాఖకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదేనని స్పష్టంచేశారు. భారీ సంఖ్యలో పోలీస్ నియామకాలు జరుగుతున్నాయని, ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ చివరిదశకు చేరిందని వివరించారు. గురువారం ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రెయినీ ఎస్సైలు, కానిస్టేబుళ్లకు శిక్షణ, పోలీస్ శిక్షణ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్, కోర్టు సంబంధ వ్యవహారాలు, సున్నిత ప్రాంతాల పరిస్థితి తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. కొత్తగా వచ్చే ఎస్సైలు, కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభం అవుతుందని, అన్ని పోలీస్ శిక్షణ కేంద్రాలను సన్నద్ధంగా ఉంచాలని సూచించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని, నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను విరివిగా వినియోగించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు డీజీలు సంజయ్కుమార్ జైన్, అభిలాష బిస్త్, మహేశ్ భాగవత్, శ్రీనివాస్రెడ్డి, ఐజీలు తరుణ్ జోషి, షానవాజ్ ఖాసిం, చంద్రశేఖర్రెడ్డి, డీఐజీ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.