హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఈ ఘనత సాధించటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఎంతో ఉన్నది. రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ముమ్మరంగా వస్తున్నాయంటే అందుకు కేసీఆర్ విజనే కారణం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో పోలీస్ కమాండ్ కంట్రోల్ హైదరాబాద్లో ఏర్పాటైంది. ఇతర రాష్ర్టాల పోలీసులు సైతం మన పోలీసుల సలహాలు, సూచనలు తీసుకోవటం గమనార్హం. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది.
ముందుచూపుతో నేరాల కట్టడి
టెక్నాలజీ వాడకం పెరగటంతో సైబర్నేరాలు పెరుగుతున్నాయని, అలాగే డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతున్నదని, ఈ నేరాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసిందని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ), తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) విభాగాలను ఆయన బుధవారం రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విజన్తో రాష్ట్రం ఏర్పడగానే శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. ఇప్పుడు ప్రతీది టెక్నాలజీపై ఆధారపడటంతో దీనిని ఆసరాగా చేసుకుంటూ సైబర్ నేరాలు కూడా పెరిగాయని తెలిపారు. అలాగే డ్రగ్స్ వాడకం కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలోనే అప్రమత్తమైందని చెప్పారు. సైబర్నేరాలు, డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసిందని వివరించారు.
దేశానికే ఆదర్శం తెలంగాణ
తాగు, సాగునీరు, ఆరోగ్యం, పారిశ్రామికాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ.. ఇలా అన్ని రంగాలలో తెలంగాణ విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుండాలని, అందుకు తగ్గట్టుగానే సీఎం కేసీఆర్ శాంతిభద్రతలకు పెద్దపీట వేశారని చెప్పారు. పోలీస్శాఖ సమర్థంగా పనిచేస్తేనే అన్ని విభాగాలు అదే తోవలో నడుస్తాయని, తెలంగాణలో ఇది అమలు చేస్తూ, ఆచరిస్తూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందని వెల్లడించారు. దేశంలోకి సముద్ర, వాయు మార్గాల ద్వారా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా ప్రవేశిస్తున్నాయని, సరిహద్దుల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇందుకు చట్టాల్లో కూడా మార్పులు తేవాలని కోరారు. డ్రగ్స్, సైబర్నేరాలు అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
తెలంగాణలో శాంతిభద్రతలు పటిష్టం
ఒకప్పుడు కరువు ప్రాంతాల జాబితాలో ఉన్న తెలంగాణ నేడు ఇండియాలోనే పర్ క్యాపిటా ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఎదిగినట్టు స్వయంగా కేంద్రమే ప్రకటించిందని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటమేనని వివరించారు. నేడు కేటీఆర్ విదేశాలు పర్యటిస్తూ రాష్ర్టానికి వేలకోట్ల పెట్టుబడులు రప్పిస్తున్నారని, దీనికంతటికీ ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో శాంతిభద్రతలను పటిష్టపర్చటమేనని వెల్లడించారు. ఇందులో ప్రతి కానిస్టేబుల్, ఎస్ఐ పాత్ర ఉందని పోలీస్ సేవలను కొనియాడారు. సైకిల్ పెట్రోలింగ్ నుంచి సైబర్ పెట్రోలింగ్కు మారిందని, పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఎక్కడికక్కడ సైబర్ నేరాలను అడ్డుకోవటం, డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రంలో విస్తరించకుండా కూకటివేళ్లతో పెకిలించటానికి ఈ బ్యూరోలు పనిచేస్తాయని చెప్పారు.
నార్కోటిక్స్ బ్యూరోతో అద్భుత ఫలితాలు
డ్రగ్స్ను పూర్తిస్థాయిలో అణిచేసేందుకు హైదరాబాద్లో 16 నెలల క్రితమే నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటైందని,దాని ద్వారా అద్భుత ఫలితాలొచ్చాయని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. కరోనా సమయంలో మన దగ్గర డ్రగ్స్ వాడకం పెరిగిందని, డ్రగ్స్ అణిచివేతకు ముఖ్యమంత్రి రెండుస్లారు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అందులో భాగంగానే మొదట హైదరాబాద్లో హెచ్న్యూ ఏర్పాటు చేసి డ్రగ్స్ డిమాండ్, సైప్లె లింక్లను తెగ్గొట్టి ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. స్థానిక, అంతరాష్ట్ర, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్లను ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నట్టు చెప్పారు. 300 ప్రత్యేక పోస్టులను ప్రభుత్వం ఈ బ్యూరోకు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు.
సైబర్ ముప్పు తప్పించేందుకే
రాష్ట్రంలో సైబర్ పర్యావరణ వ్యవస్థను రక్షించే లక్ష్యంతో ప్రత్యేక బ్యూరోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐడెంటిటీ, ప్రొటెక్ట్, డిటెక్ట్, రెస్పాండ్, రికవరీ పద్ధతులతో సైబర్ ముప్పును బ్యూరో ఎదుర్కొంటుందని చెప్పారు. అన్ని జిల్లాల్లో, కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ సైబర్ముప్పును తప్పించేందుకే బ్యూరో నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. సైబర్ నేరాలను అడ్డుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ర్టాలతో కూడిన జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోనూ బ్యూరో సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. బ్రిటిష్ హై కమిషనర్ గారెత్ వ్యాన్ ఓవెన్, అదనపు డీజీలు అనిల్కుమార్, స్వాతిలక్ర, మహేశ్భాగవత్, షిఖాగోయల్, డీఎస్ చౌహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.