న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన లూథియానాకు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పరస్ సింగ్ అలియాస్ బంటీని అరెస్ట్ చేశారు. పరస్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నినంగ్ ఎరింగ్ ను నాన్ ఇండియన్ గా పేర్కొనడమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతూ సింగ్ సోమవారం మరో వీడియో పోస్ట్ చేశారు.
సింగ్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆయనపై ఇటానగర్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ లో కేసు నమోదైందని అరుణాచల్ ప్రదేశ్ పోలీస్ చీఫ్ ఆర్పీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. మరోవైపు సింగ్ అరెస్ట్ ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్ధారిస్తూ నిందితుడిని తక్షణమే అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు అప్పగించాలని తాను లుథియానా పోలీస్ కమిషనర్ తో మాట్లాడానని వెల్లడించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అరుణాచల్ ప్రదేశ్ సీఎం హెచ్చరించారు.