హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు 450 ఎకరాల స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, కిషన్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో సమీక్షించారు. అనంతరం రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒకే విమానాశ్రయం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. వరంగల్లో విమానాశ్రయానికి అడుగులు వేస్తున్నామని, మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్లో 360 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలనుకున్నామని, అదనంగా మరో 450 ఎకరాల స్థలం అవసరముందని చెప్పారు. పౌర విమానయాన, రక్షణశాఖలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న క్షేత్రస్థాయిలో ఓఎల్ఎస్(అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్వే) చేసిన తర్వాత రన్వే ఓరియెంటేషన్పై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రక్షణశాఖ మాస్టర్ ప్లాన్కు అంగీకారం తెలిపాక శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని స్పష్టంచేశారు.