Moinabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ): ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసే రోజులు పోయి, తాజాగా ప్రహరీలను సైతం ధ్వంసం చేసి అందులోని మనుషులను నిర్బంధించి మరీ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఫిబ్రవరి 27న అర్ధరాత్రి మొయినాబాద్లో జరిగిన ఘటనే నిదర్శనం. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. చిలుకూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 714(పార్ట్) వెస్ట్సైడ్ ఫామ్లో నగరానికి చెందిన ఎర్నేని సుధాకర్బాబు 3.18 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి దాని చుట్టూ ప్రహరీ నిర్మించడంతోపాటు అందులో కంటైనర్ సైతం ఏర్పాటుచేశాడు.
కాగా, నెల రోజులుగా ప్రహరీపై ఇనుప గ్రిల్స్ను ఏర్పాటుచేసే పనులు నిర్వహిస్తున్నాడు. ఈ పనులను సూపర్వైజర్ అయిన జన్వాడకు చెందిన శవ్వ మల్లయ్య పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ముందుగా సీసీ కెమెరాలను మాస్క్లతో మూసివేశారు. అక్కడ పనిచేసే కార్మికులను ఓ గుడిసెలో నిర్బంధించారు. బయటకు వస్తే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
అనంతరం జేసీబీతో ఆ స్థలంలోకి వచ్చి ప్రహరీని కూల్చివేయడంతోపాటు కంటైనర్ను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని కార్మికుల ద్వారా తెలుసుకున్న సూపర్వైజర్ మల్లయ్య, తన యజమాని సుధాకర్బాబుకు తెలిపాడు. అనంతరం జరిగిన ఘటనపై మరుసటి రోజు సూపర్వైజర్ మల్లయ్య మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇదే భూమిలోకి గోపాల్ చౌదరి, సత్తార్ఖాన్, భరత్, ప్రేమ్ తదితరులు చొరబడి ప్రహరీని కూల్చివేసే కుట్ర చేశారని, దీనిపై గతంలోనూ కేసులు పెట్టినట్టు తెలిపాడు. ఈ విషయంపై చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతమ్ను వివరణ కోరగా.. ఘటన జరిగిన మాట వాస్తవమేనని, బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.