హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హుకుం జారీ చేసిన 24 గంటల్లోనే ఆ పార్టీ మరో సీనియర్ నేత తన నిరసనగళాన్ని వినిపించారు. కాంగ్రెస్ను మోసంచేసిన దొంగలకు డోర్లు ఎలా తెరుస్తారు? అని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నిలదీశారు. ‘కాంగ్రెస్ను మోసం చేసిన దొంగలకు డోర్లు తెరిచి పార్టీలో చేర్చుకుంటే మాలాంటి నాయకులు, కార్యకర్తలు చచ్చిపోతారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతల సమావేశం జరిగింది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డితో కలిసి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ సెగ్నెంట్ నుంచి పోటీచేసి ఓడిపోయిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ను మోసం చేసిన దొంగలను పార్టీలో చేర్చుకుంటే తమలాంటి వాళ్లంతా ఏం కావాలి? అని ప్రశ్నించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఏకీభవిస్తూ పెద్దపెట్టున చప్పట్లు చరిచి మద్దతు పలికారు. ఆ సమయంలో సీఎం రేవంత్రెడ్డి, ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి ఇబ్బందికరంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక: రేవంత్రెడ్డి
క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో రంజిత్రెడ్డి, దానం నాగేందర్, సునీతా మహేందర్రెడ్డికి టికెట్లు ఇచ్చామని రేవంత్ సమర్థించుకున్నారు. ఒకే సామాజిక సామాజిక వర్గానికి చెందిన నేతలకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలకూ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్తోనే అందరికి సామజిక న్యాయం జరుగుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అని వ్యా ఖ్యానించారు. తెలంగాణ నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో వచ్చే నెల 6 లేక 7న జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రకటించే గ్యారెంటీలపై భారీ సభ నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు.
పెరుగుతున్న నిరసన గళాలు
కాంగ్రెస్ను నమ్ముకున్న వారికి కాకుండా బయటి నుంచి వచ్చిన వారిని పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వటాన్ని సీనియర్ నేతలు నిరంజన్, వీహెచ్ తప్పుపట్టిన విషయం తెలిసిందే. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీసీ నాయకులు కాబట్టి హెచ్చరించారని, మరి రెడ్డి నాయకులైతే హెచ్చరించేవారా? అని బీసీ నేతలు మండిపడ్డారు. తాజాగా నిరసన గళం విప్పిన లక్ష్మారెడ్డి ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావటంతో పీసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.