దళితుల ఆర్థికాభివృద్ధే సీఎం లక్ష్యం
దళితబంధు ద్వారా మెరుగైన, లాభదాయకమైన, ఇష్టమైన వృత్తిని ఉపాధి యూనిట్గా ఎంచుకొంటున్నారు. ప్రభుత్వం అందజేసిన రూ.10 లక్షల సొమ్మును దళితులు రెట్టింపు చేయాలి. సంపద సృష్టించాలి. ఆర్థికాభివృద్ధిని సాధించాలి. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. స్వప్నం. వాటిని నెరవేర్చేందుకు లబ్ధిదారులు, అధికారులు కృషి చేయాలి. దళితబంధు పథకాన్ని విజయవంతం చేసి, దేశానికి ఆదర్శంగా నిలపాలి.
– కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/యాదాద్రి భువనగిరి: ఒకప్పుడు వెలివాడలు.. అవే ఇప్పుడు వెలుగువాడలు! సమాజానికి దూరంగా బతికే నిరుపేద సగర్వంగా తలెత్తుకొన్న రోజులివి. ఏడాది కిందటి వరకు కూలీలు, ఇప్పుడు యజమానులుగా మారిపోయారు. దేశానికే దారిచూపుతున్న మహోద్యమం.. దళితబంధు. ఇంతటి మహోన్నతమైన పథకం పురుడు పోసుకొని శుక్రవారానికి సరిగ్గా ఏడాది. ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా, విమర్శకుల చూపును కట్టిపడేసేలా పథకం ముందుకు సాగుతున్నది. దళితుల సమున్నద్ధరణ, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన దళితబంధు ఎందరో తలరాతలను మార్చుతున్నది. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ చూపని విధంగా, వినూత్న తరహాలో సీఎం కేసీఆర్ చూపిన పరిష్కార మార్గం ఇవాళ దిక్సూచిగా మారుతున్నది. ఇప్పుడీ పథకం లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది.
సరిగ్గా ఏడాది క్రితం.. 2021 ఆగస్టు 5న సీఎం దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకం ప్రారంభమైంది. అంతకుముందు రోజు ఆగస్టు 4న సీఎం కేసీఆర్ స్వయంగా వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామంలో వాడవాడలా కలియతిరిగారు. ప్రజలతో మమేకమై అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆదేశాలతో ఆ మరునాడే సర్కారు రూ.7.6 కోట్లు రిలీజ్ చేసింది. గ్రామంలోని 76 మంది దళితులకు దళితబంధు అందజేశారు. తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34,678 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. నిధులు పొందిన లబ్ధిదారులు ఇప్పటికే యూనిట్లను సైతం ఏర్పాటుచేసుకొని ఓనర్లుగా మారారు.
సమన్వయంతో ముందుకు
క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని సమర్థంగా అమలుచేసేందుకు యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్తున్నది. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు.. మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ, నేరుగా లబ్ధిదారులను కలిసి వారికి అందుబాటులో ఉన్న అత్యంత లాభదాయకమైన ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో యూనిట్ ఎంచుకొనేలా, ఇద్దరు నుంచి నలుగురు బృందంగా ఏర్పడి పథకాన్ని వినియోగించుకొనేలా చేస్తున్నారు. యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు ఆయా రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు.
దళితుల పేదరికం దూరం
దళితులను పేదరికం నుంచి దూరం చేసి, వారిని ప్రగతిపథంలో నడిపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులంతా ఒకే ఉపాధి మార్గాన్ని ఎంచుకోకుండా గిట్టుబాటు అయ్యే ఉపాధి మార్గాలపై దృష్టి సారించాలి. యూనిట్లను ఎంచుకోవాలి. అప్పుడే దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశముంటుంది.
– బండ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
కూలి నుంచి ఓనర్నయ్యా
నేను గతంలో సెంట్రింగ్ పనికి వెళ్లేవాడిని. కేసీఆర్ సార్ దళితబంధు ఇవ్వటంతో సొంతంగా సెంట్రింగ్ పనికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని ఒక చిన్న ట్రక్కు కూడా కొనుకున్నా. ఇప్పుడు నేనే సెంట్రింగ్ పనిని సొంతంగా చేసుకొంటున్నా. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తున్నా ట్రక్కులో సామాను తీసుకెళ్తున్నా. దళితబంధు వల్ల నేను కిరాయి మనిషి నుంచి ఓనర్నయ్యానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. – దుబ్బాసి ప్రవీణ్, వాసాలమర్రి
ఏడాది కాలంలోనే అనేక విజయాలు
ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు
బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని దళితబంధు పథకం రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఏడాది పూర్తిచేసుకొన్నదని, ఈ ఏడాది కాలంలోనే అనేక విజయాలను సాధించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అభినందనలు, కృతజ్ఞతలు అని బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే ఎంతో మంది ప్రయోజనం పొంది తమ జీవితాల్లో అనూహ్య మార్పులు సాధించినందుకు ప్రభుత్వం, అధికారులు చేసిన కృషికి ధన్యవాదాలు అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దళితబంధు పథకం ద్వారా భవిష్యత్తులో దళిత జాతి యావత్తు సమున్నతంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఇటువంటి పథకాన్ని మరిన్ని రాష్ర్టాల్లో ప్రవేశ పెట్టాలని, దళితులపై ప్రేమ ఉంటే ఇటువంటి పథకానికి శ్రీకారం చుట్టాలని కోరుతున్నామని అన్నారు.