హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ ఏజెంట్గా మారాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంత్రి కేటీఆర్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లాలని, అసత్య ఆరోపణలు చేయకూడదని హెచ్చరించారు. మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారంలో ఉండేందుకే ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రేవంత్.. మంత్రి కేటీఆర్కు అంటగట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ సమగ్ర వివరాలు వెల్లడించిన తరువాత రేవంత్ తన తప్పును ఒప్పుకోక, క్షమాపణ చెప్పే ధైర్యంలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త డ్రామాకు తెరతీశారని చెప్పారు. అందులో భాగంగానే సిట్ విచారణపై ఆంధ్రా అధికారి అంటూ దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని, గతంలో ఇదే రేవంత్ బీహారీ అధికారులు అని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాంతీయతత్వాలు, రాగద్వేషాలు అంటగట్టకూడదనే ఇంగితంలేని వ్యక్తి రేవంత్ అని ధ్వజమెత్తారు.
ఈడీ, సీబీఐ సంస్థల దుర్వినియోగం
ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని వివేకానంద ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సహా బీజేపీయేతర పక్షాలన్నీ సుప్రీంకోర్టులో కేసు వేస్తే రేవంత్రెడ్డి మాత్రం పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయటం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం మొత్తం ఈడీ, సీబీఐ, ఐటీలపై పోరాటం చేస్తుంటే రేవంత్ మాత్రం వాటి కోసం పట్టుబట్టడం వెనుక బీజేపీ ప్రమేయం ఉన్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. గాంధీభవన్లో ఇప్పటికే గాడ్సేలు చేరారనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో రేవంత్ చర్యతో ఆయన బీజేపీకి ఏజెంట్గా మారారని ఆ పార్టీల్లో చర్చ సాగుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని.. ముందుగా బండి సంజయ్కు సంస్కారం నేర్పించాలని సూచించారు. రఘునందన్రావు న్యాయవాదిగా పేపర్ లీకేజీపై మీడియా సమావేశాలు పెట్టేబదులు.. ఆధారాలుంటే కోర్టులో కేసు వేసుకోవాలని సూచించారు.