జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది కౌలు రైతులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో సహాయక చర్యలు ప్రారంభించిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు.. ఎట్టకేలకు కూలీలను రక్షించారు. కూలీలు ప్రాణాలతో తిరిగిరావడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూలీల పరిస్థితిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారికి భరోసానిచ్చారు.
కుర్రులో చిక్కుకుపోయిన కూలీలను రక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు.
బోర్ణపెల్లికి చెందిన వోల్లే రఘునాథ్, రంగారావు, దేవిధాన్, సాహెబ్ రావు, విజయ్, కార్తీక్, సత్యభామ, సునీత, విజయంతి అనే తొమ్మిది మంది కుర్రులో కౌలుకు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. గోదావరి నది రెండుగా చీలిన చోట ఎత్తయిన ప్రాంతంలో కుర్రు ఉంది. కుర్రు ప్రాంతంలో వరద ప్రవాహం అధికమవడంతో.. ఆ 9 మంది కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. వరద పెరగడంతో రైతులు ఆందోళనకు గురై.. తమను రక్షించాలని బోర్ణపెళ్లి గ్రామస్తులు, అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రంగాం అప్రమత్తమైన వారిని రక్షించారు.