హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి అతిథిగా హాజరై మాట్లాడారు.
‘తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన విజనరీ, చాలెంజింగ్, లెజండరీ లీడర్. దళితులు, రైతుల పట్ల కేసీఆర్ కమిట్మెంట్ చాలా గొప్పది. రాష్ట్రం కోసం ఎంత కొట్లాడారో నాకు తెలుసు. ఆయన పోరాటాల వల్లే తెలంగాణ ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ కోసం ఎంత శ్రమించారో.. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా పనిచేసి ఘన విజయం సాధించాలి. తెలంగాణను అభివృద్ధి చేసి.. ఇప్పుడు దేశాభివృద్ధిని సవాల్గా తీసుకొని ముందుకువెళ్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్కు జేడీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. ఆయనతో కలిసి నడుస్తాం.
కేసీఆర్ హృదయాంతరాల్లో పేదలు, బడుగు, బలహీనవర్గాల గురించి ఆతృత, నిబద్ధత ఉన్నది. ఎలాంటి స్వార్థం లేకుండా దేశ నిర్మాణం కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఘన విజయం సాధిస్తారు. ఎనిమిదేండ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేంద్ర బీజేపీ సర్కారుకు కేసీఆరే గట్టి సమాధానం చెబుతారు. బీఆర్ఎస్కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని కుమారస్వామి అన్నారు.
టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు జాతీయ పార్టీ పేరును ప్రకటించాల్సిన ముహూర్త సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తున్న జనతాదళ్ (ఎస్) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి. శుభకృత్ నామసంవత్సరం ఆశ్వయుజ శుద్ధ దశమి (05-10-2022) నాడు మధ్యాహ్నం 1.19 గంటలకు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేశారు.