Etela Rajender | బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అద్భుతంగా పురోగమిస్తున్నది. వరుసగా ఎన్నికల్లో ఆయన పార్టీని గెలిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాను. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పోరాడుతాను.
-2021, జూన్ 14న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీలో చేరిన సమయంలో ఈటల
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాను. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని విస్తరించేందుకు కృషిచేస్తాను’ అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బండి సంజయ్ని ఈటల ఆకాశానికెత్తారు. రెండేండ్ల తర్వాత ఇప్పుడు ఈటల రాజేందర్ విజయవంతంగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీ ఢిల్లీ పెద్దలను బెదిరించి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అని కొత్త పోస్టు సృష్టించి, ఆ కమిటీకి చైర్మన్గా తనను నియమించేలా చేశారని బీజేపీలోని ఒక వర్గం చెప్తున్నది. ఈ రెండేండ్లలో జరిగిన పరిణామాలను గమనిస్తే బండి సంజయ్ని ఓవైపు పొగుడుతూనే మరోవైపు ఆయన సీటు కిందికి క్రమంగా నీళ్లు తెచ్చినట్టు స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. చివరికి బండిని అవమానకరంగా పదవి నుంచి దింపేవరకు ఈటల విశ్రమించలేదని చెప్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపుకోసం బండి సంజయ్ తీవ్రంగా శ్రమించారని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డి గెలిపిస్తే, ఇప్పుడు ఆయనకే ద్రోహం చేశారని బండి అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్రెడ్డిని పొగిడే పనిలో పడ్డారని అంటున్నారు.
చేరేదాకా ఒక లెక్క.. చేరిన తర్వాత ఇంకో లెక్క
బీఆర్ఎస్ నుంచి వెళ్లగొడితే తన రాజకీయ అవసరం కోసం, అరెస్టుల నుంచి తప్పించుకొనేందుకే ఈటల బీజేపీలో చేరారనన్నది సుస్పష్టం. చేరేదాకా ఒక లెక్క.. చేరాక ఇంకో లెక్క.. అన్నట్టుగా ప్రవర్తించారని, మొదటి నుంచే బండికి ఎదురు తిరగడం మొదలుపెట్టారని బండి సంజయ్ వర్గం మండిపడుతున్నది. పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికే ఆయన చేరారనీ విమర్శిస్తున్నారు. వాస్తవానికి బీజేపీలో ఎవరైనా యాత్రలు, సమావేశాలు నిర్వహించాలంటే రాష్ట్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ పార్టీలో చేరిన తొలినాళ్లలోనే ఎవరి అనుమతి తీసుకోకుండానే అనేక ప్రాంతాలకు వెళ్లి నేతలను కలిశారు. బీఆర్ఎస్ నేతలను కలిసి బీజేపీలోకి చేర్పించేందుకు కష్టపడుతున్నారని అందరూ భావించారు. కానీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు, సంజయ్ పరపతిని తగ్గించేందుకే ఇలా చేశారని బండి అభిమానులు చెప్తున్నారు. చేరికల కమిటీ చైర్మన్గా నియమించాక ఈటల తన కోటరీని పెంచుకున్నారంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండానే రాష్ట్రంలో పర్యటించారని చెప్తున్నారు. ఈటల బృందం పొంగులేటి, జూపల్లిని ఖమ్మంలో కలిసిన విషయం తెలియదని బండి చెప్పడమే ఇందుకు ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు.
బలపడేందుకు బ్లాక్మెయిలింగ్!
అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను బలమైన నేతగా ఈటల తన బృందం ద్వారా ప్రచారం చేయించుకున్నారని కొందరు బీజేపీ నేతలే చెప్తున్నారు. పార్టీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు, నియంతృత్వ ధోరణి పెరిగిపోవడంతో మెల్లిగా వ్యతిరేకత మొదలైంది. ఇదే అదనుగా ఈటల ఢిల్లీ పెద్దలకు వరుసగా ఫిర్యాదులు చేశారని కథనాలు వచ్చా యి. తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినా పట్టించుకోకపోవడంతో బండి సంజయ్పై వరుసగా ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లేలా మేనేజ్ చేశారని అంటున్నారు. చివరికి నేరుగా ఢిల్లీకి వెళ్లి బండిని దింపేస్తారో లేదో, తనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ పదవి ఇస్తారో లేదో 10 రోజుల్లో తేల్చాలని అల్టిమేటం ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. బండిని సాగనంపే క్రమంలో ఈటల పార్టీని భ్రష్ఠుపట్టించారని.. ఎన్నడూ లేనట్టుగా లీకులివ్వడం, బహిరంగ కామెం ట్లు, పిర్యాదుల వంటి విషసంస్కృతిని తెచ్చారని ఆరెస్సెస్ వాదులు మండిపడుతున్నారు. బండిని తప్పించటంపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ముందే గుర్తించిన సీఎం కేసీఆర్
గతంలో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఈటల రాజేందర్కు మంచి పదవులు, హోదా దక్కాయి. బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఆయనకు సీఎం కేసీఆర్ దాదాపుగా ఏదో ఒక పదవి ఇస్తూనే వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోనూ సముచిత గౌరవం కల్పించారు. అయినా ఈటల సంతృప్తి పడలేదు. క్రమంగా పార్టీని రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్ర పన్నారు. వరుసగా మీడియాకు లీకులివ్వడం, ఇంటర్వ్యూల్లో పార్టీ ప్రతిష్ఠను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వంటివి సీఎం కేసీఆర్ గుర్తించారు. మరోవైపు పేదలకు అండగా ఉండాల్సిందిపోయి వారి భూములను కబ్జా చేసి, వేధించడం వంటి చర్యలకు ఈటల పాల్పడటంపై సీఎం కేసీఆర్కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈటల ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థమైన వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలిగించడంతోపాటు కబ్జాలపై విచారణకు ఆదేశించారు. అప్పుడు ఈటల బయటికి వెళ్లిపోవడమే మంచిందైందని, లేకపోతే ఇప్పుడు బీజేపీకి పట్టిన పరిస్థితే బీఆర్ఎస్కు పట్టేదని విశ్లేషకులు చెప్తున్నారు.
రెండుగా చీలిన బీజేపీ
బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి పెట్టిన చిచ్చు ఆరడం లేదు. బండి సంజయ్ని పక్కనబెట్టి కిషన్రెడ్డికి పదవి అప్పగించడంతో పార్టీలో కిందిస్థాయి క్యాడర్ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు రెండుగా చీలిపోయింది. కిషన్రెడ్డి, సంజయ్కి మద్దతుగా నేతలు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో వాగ్వాదానికి దిగుతున్నారు. బండి సం జయ్ని అవమానకరంగా వెళ్లగొట్టారని కొంద రు అంటుంటే, మరికొందరు మాత్రం సరైన నిర్ణయం తీసుకొన్నారని కామెంట్లు చేస్తున్నా రు. విజయశాంతి ఇప్పటికే సంజయ్కి మద్దతు గా నిలిచారు. బండిని తొలిగించడం బాధాకరమంటూ కామెంట్ చేశారు. ఇ న్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ధర్మపురి అర్వింద్, ఈటల వంటి నేతల ముఖాలు కళకళలాడటా న్ని బట్టి ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో కిషన్రెడ్డి వర్గం నేతలు తెరపైకి వచ్చారు. సంజయ్ తొలగింపుతో సంబురాలు చేసుకొంటున్నారు.