కుభీర్ : నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రం కుభీర్ వినాయక విగ్రహాల తయారీకి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. కుభీర్కు చెందిన పర్వత్వార్ సాయిశ్యామ్ తన 13వ ఏట నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల కిందట అతను మట్టితో చిన్నచిన్న ప్రతిమలను తయారు చేసి విక్రయించేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో ప్రారంభించారు.
కుభీర్లోని శివసాయి ఆలయ సమీపంలో అతను ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి, రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే విశ్వబ్రహ్మ కళాధామం ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాలే కాకుండా కర్రతో చేసిన అనేక రకాల విగ్రహాలు, జాతీయ నాయకుల ప్రతిమలతోపాటు బండరాళ్లపై చెక్కిన శిల్పకళ శ్యామ్కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. మహారాష్ట్రతోపాటు ఇక్కడి వివిధ ఆలయాలకు బండరాళ్లపై చెక్కిన విగ్రహాలను అందించారు.
ప్రతి ఏటా వివిధ రకాల ఆకృతులు విభిన్నమైన అంశాలతో కూడిన వినాయక విగ్రహాలను తయారు చేసి కుభీర్ అంటేనే వినాయక విగ్రహాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తీసుకొచ్చారు. రాజస్థాన్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఆంధ్ర నుంచి కొబ్బరి పీచును తెప్పించుకొని ఈ విగ్రహాలకు వినియోగిస్తుంటారు. పెద్ద పరిశ్రమగా తయారైన ఈ కేంద్రంలో ఏడాది పొడవునా పది నుంచి 20 మందికి ఉపాధి దొరుకుతుంది.
ప్రత్యేకంగా హైదరాబాద్, విజయవాడ, మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణాల నుంచి రంగురంగుల వస్త్రాలు, పట్టుపంచలు, కండువాలు, మెరుపును తెప్పించి విగ్రహాలకు అలంకరిస్తారు. నిర్మల్ జిల్లాలో విగ్రహాల తయారీ కేంద్రాలు స్వల్పంగా ఉన్నప్పటికీ అందులో నాలుగైదు రకాల విగ్రహాలు మాత్రమే అచ్చులతో తయారు చేస్తారు. కానీ కళాకారుడు సాయి శ్యామ్ తయారు చేస్తున్న విగ్రహాలు వివిధ రకాలుగా అందర్నీ ఆకర్షించే విధంగా ఉంటున్నాయి.
అందుకే ఆరు నెలల ముందుగానే ఆర్డర్లు ఇస్తారు. మూడు అడుగుల నుంచి సుమారు 15 అడుగుల వరకు విగ్రహాలు వందల సంఖ్యలో తయారు చేస్తారు. ఈయన చేసిన విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. విగ్రహాల తయారీలో పెరుగాంచిన సాయి శ్యామ్ను రాష్ట్రస్థాయిలో ట్రూ ఇండియన్ అవార్డు, గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ తెలంగాణ అవార్డు, ఉత్తమ శిల్ప కళాకారుడిగా జిల్లాస్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు.
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ హైదరాబాద్ కమిషనర్ శైలజా రామయ్యర్ కుభీర్లోని కళాధామాన్ని సందర్శించి కళాకారుడు సాయి శ్యామ్ను అభినందించారు. తమ సంస్థపరంగా కర్ర, బండ రాళ్లతో చేసిన ప్రతిమలను విక్రయించుకునేందుకు ఎగ్జిబిషన్ స్టాల్ను ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. మనిషిని చూసి అలాగే ప్రతిమ తయారు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తయారు చేసే విగ్రహాలకు గిరాకీ ఎక్కువ, ఒక్క విగ్రహం కూడా మిగిలిపోవడం ఉండదు.
కాగా గత 20 ఏళ్లుగా తన కళకు పదునుపెట్టి విభిన్న ఆకృతులలో వినాయక విగ్రహలు తయారుచేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సాయి శ్యామ్ను అందరూ అభినందిస్తున్నారు.