హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని చెప్పారు. మోసం చేయడంలో బీజేపీని మించిన పార్టీ, మోదీని మించి న నాయకుడు మరొకరు లేరని పేర్కొన్నారు.
శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో గండ్ర వెంకటరమణారెడ్డి మీడియాతో మా ట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్కు వచ్చిన ప్రజాదరణను చూసి కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని దుయ్యబట్టారు. మీడియాలో స్పేస్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని అయోమయ స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటన చేశారని చెప్పారు.