Minister KTR | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పెట్రో ధరలు తగ్గాలంటే కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న మోదీ సర్కారు తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రో ధరల దోపిడీపై మంత్రి కేటీఆర్ గురువారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.
పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నది. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయింది. 2013లో బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం రూ.76. నేడు బ్యారెల్ ముడి చమురు 66 డాలర్లకు తగ్గినా, పెట్రోల్ ధర లీటర్కు రూ.110 ఉండడమే ఇందుకు నిదర్శనం. దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. ముడి చమురును బూచిగా చూపించి కార్పొరేట్ మిత్రుల ఖజానాను నింపేందుకు మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురు ధరలతో సంబంధం లేకుండా పెట్రోల్ ధరను పెంచుకుంటూ పోతున్నది. దీంతో దేశ ప్రజలు ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా 45 శాతంపైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సరుకుల ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్నంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతున్నది. అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్రం సృష్టించింది. కేంద్ర వైఫల్యం వల్ల 45 ఏండ్లలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తున్నది.
ఇన్నాళ్లూ అంతర్జాతీయ ముడి చమురు ధరలు లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఒకవైపు రష్యా నుంచి అత్యంత తకువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకొంటున్న కేంద్ర సర్కారు.. మరోవైపు తకువ ధరకు ముడి చమురు అందుబాటులో ఉన్నా.. పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న రూ. 35 వేల కోట్ల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దకిందన్నది వాస్తవం. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకొంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతున్నది. తకువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకొని, దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలి. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ.. దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధాని మోదీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నా.
ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. అయితే దేశ ప్రజలు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి. లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.
అంతర్జాతీయ మారెట్లో ముడి చమురు ధర 2013లో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక రూపాయి వ్యాట్ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. కానీ, ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నది.