హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీలు రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి నేతలతో ఆయన హైదరాబాద్లో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వైఖరిపై ప్రజలు కోపంతో ఉన్నారని, పదేండ్ల పాటు దేశంలోని అన్ని వర్గాలు, అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ పాలనపై విసుగెత్తిపోయారని తెలిపారు. అన్నదాతల నుంచి ఆటోడ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను బీఆర్ఎస్ మాత్రమే కాపాడుతుందన్న అభిప్రాయం ప్రజలు, మేధావుల్లో ఉన్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జులు పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సవరించుకొని క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కసిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాల కన్నా వ్యవస్థాగత నిర్ణయమే ముఖ్యమని, ఉమ్మడిగా పనిచేస్తే ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటామని చెప్పారు. వరంగల్ అభ్యర్థి మారేపల్లి సుధీర్కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల్లో మంచి స్పందన వస్తున్నదని అన్నారు. పెద్దపల్లిలోనూ గులాబీ గెలు పు ఖాయమైందని కేటీఆర్ అన్నారు.
ఉద్యమ ప్రస్థానంతో పాటు రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా కొప్పుల ఈశ్వర్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని గుర్తుచేశారు. కొప్పుల లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలమని తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు సమష్టిగా పనిచేస్తామని, నాయకత్వం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తామని నేతలంతా వాగ్దానం చేశారు. సమావేశాల్లో శాసనమండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్లు దాస్యం వినయభాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, హనుమకొండ జడ్పీ చైర్మన్, వరంగల్ లోక్సభ అభ్యర్థి సుధీర్కుమార్ పాల్గొన్నారు.