గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కాలం చెల్లిన 1999 నాటి రెమిషన్(శిక్ష కాలం తగ్గింపు) విధానం కింద దోషులను విడుదల చేయడంపై ఇప్పటికే తీవ్రచర్చ నడుస్తుండగా.. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. బిల్కిస్ బానోపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన దోషుల విడుదలకు సిఫారసు చేసిన గుజరాత్ ప్రభుత్వ కమిటీలో బీజేపీకి చెందిన వారే సగం మంది ఉండటం గమనించాల్సిన అంశం. అధికారిక డాక్యుమెంట్ ప్రకారం కమిటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. వారిలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒకరు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, మరో ఇద్దరు కాషాయ పార్టీతో సంబంధాలు ఉన్నవారేనని ఓ జాతీయ మీడియా సంస్థ దర్యాప్తులో తేలింది.
అది ప్రభుత్వ నిర్ణయం.. కోర్టును నిందించొద్దు
బాల్కిస్ బానో కేసులో దోషుల విడుదల విషయంలో న్యాయవ్యవస్థను నిందించొద్దని, అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని జస్టిస్ మృదుల భట్కర్ ప్రజలను కోరారు. 11 మంది దోషులకు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన బాంబే హైకోర్టు ధర్మాసనంలో జస్టిస్ మృదుల ఒకరు. ప్రజలు న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్న ఆమె.. ప్రజల హక్కులను కాపాడేందుకు న్యాయవ్యవస్థ అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుందని పేర్కొన్నారు.
లైంగికదాడి దోషులను వదిలేస్తారా?;గుజరాత్ ప్రభుత్వ నిర్వాకంపై కేటీఆర్ ట్వీట్
గుజరాత్లో 2002లో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 11మంది ఖైదీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయి. సాధారణంగా అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై హామీలు ఇవ్వడం చూశాం. కానీ ఇప్పుడు గర్భిణులు, చిన్నారులను చంపిన దోషులను విడుదల చేస్తున్నారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేనిది. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించకతప్పదు’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
లైంగికదాడి చేస్తే జీవితాంతం జైలు
లైంగికదాడి కేసులో దోషులను చనిపోయే వరకు జైలులోనే ఉంచాలని కే టీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఆన్లైన్ ట్రోలింగ్పై మంత్రి తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో నిందితులను శరవేగంగా అరెస్టు చేసి, జైలుకు కూడా పంపామని తెలిపారు. అయితే 45 రోజుల తరువాత హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. చట్ట ప్రకారం దోషులకు శిక్ష పడే వరకు తమ ప్రభుత్వం పోరాడుతుందని స్పష్టం చేశారు. బాలనేరస్థుల చట్టం, ఐపీసీ, సీఆర్పీసీలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. లైంగికదాడికి పాల్పడేవారికి బెయిల్ ఇవ్వకుండా పకడ్బందీ చట్టం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. జీవిత ఖైదు శిక్షను నిజమైన రీతిలో అమలు చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.