నల్లగొండ : మోసపోతే గోస పడుతాం అని చెప్పినం. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) విచక్షణతో ఓటెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నకిరేకల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశాడు. ధాన్యం బోనస్ విషయంలో కూడా మాట తప్పిండని విమర్శించారు.
సన్న వొడ్లకు మాత్రమే బోనస్ అంటూ అన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నాడని సీఎంపై మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో అభూతకల్పనలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్న కాంగ్రెస్కు ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే విద్యుత్ కూడా సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తుండు, మహిళలకు రూ.2,500 ఇస్తా అని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా నిర్లజ్జగా అబద్ధాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ రేవంత్ రెడ్డి పూటకో అబద్ధం అడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినం అని అబద్ధాలు అడుతున్నాడు. 30 వేల ఉద్యోగాలు కేసీఆర్ రిక్రూట్మెంట్ చేస్తే వాటికి కాగితాలు పంచుతూ సీఎం అబద్ధాలు అడుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గొప్ప విద్యావంతుడు అతనికి ఓటేస్తే ప్రభుత్వంపై కొట్లాడుతాడని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్. అతను అబద్ధాలు ఆడే వ్యక్తి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అమ్మాయిలు పెట్టిన కేసులే పది దాకా ఉన్నాయి. అతను చేసేవి అన్నీ లంగ పనులేనని ఘాటు విమర్శించారు. అతన్ని చట్టసభల్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలన్నారు. జీవో 46 ని రద్దు చేసేందుకు మా ప్రభుత్వంలో అన్నీ సిద్ధం చేసినం. దురదృష్టవశాత్తు అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ప్రాసెస్ అంతా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.