సంగారెడ్డి : కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపు రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. సోమవారం సంగారెడ్డి జైలులో అక్రమ కేసుల్లో నిర్బంధంలో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతోందని తీవ్రంగా విమర్శించారు.
మన్నె క్రిషాంక్ ఓ ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది, పీహెచ్డీ పట్టా పొందిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఎస్ఎండీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు తీసుకువస్తున్నందుకే క్రిషాంక్పై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో 12 రోజులుగా జైలులో పెట్టి ‘హ్యాబిచువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలను ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలోనే బిజీగా ఉందని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్లో పగటిపూట కాల్పులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు.
కానీ, ఎవరు ట్వీట్ చేశారు అన్నదానిపై మాత్రం అప్రమత్తంగా ఉందని ఎద్దేవా చేశారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్, జర్నలిస్టులపై వేధింపులు వంటి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా క్రిషాంక్ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయంపై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేస్తామని తెలిపారు.
మా నాయకులను వేధించినా మేము వెనక్కి తగ్గం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎవరూ భయపడవద్దు. పార్టీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది. న్యాయం, ధర్మం మన వైపు ఉన్నాయి అని తెలిపారు. చివరగా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను బయటపెడుతున్న మీడియాకు కృతజ్ఞతలు తెలుపారు.