హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వేసేవలు మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యంగా జరిగేందుకు కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటుచేయాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కోరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్పై ఆర్థికభారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతున్నదని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేటీఆర్ లేఖ రాశారు. పార్టీ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారు. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉన్నదని, భవిష్యత్తులో ఇది 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక డివిజన్కు ఉండాల్సిన పరిమితి కంటే ఇది చాలా ఎకువని, దీనివల్ల నిర్వహణ భారం గా మారి భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రతిపాదిత కాజీపేట డివిజన్లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా 2,000 ట్రాక్ కిలోమీటర్ల మేర సమర్థవంతమైన పాలన అందించవచ్చని కేటీఆర్ సూచించారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ధాన్యాల రవాణా ద్వారా ఈ ప్రాంతం నుంచి రైల్వేకు భారీ ఆదాయం లభిస్తున్నదని, ఇంతటి ప్రాధాన్యం గల మార్గాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. కాజీపేట ఇప్పటికే రైల్వేహబ్గా మారుతున్న తరుణంలో, డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదమవుతుందని పేర్కొన్నారు.