హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాది ఉత్తరాలు రాయాలని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ప్రగతిభవన్ నుంచి స్వదస్తూరితో ప్రధానికి పోస్టుకార్డు రాశారు. చేనేతపై 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను పోస్టుకార్డులో ప్రస్తావించారు. చేనేత కార్మికుల సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల మీద కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత సమస్యలపై సీఎం కేసీఆర్తో పాటు తాను కూడా పలుమార్లు ప్రధానికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైనా పన్ను వేసిన తొలి ప్రధాని మోదీయేనని విమర్శించారు. ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే సాంస్కృతిక సారథులుగా పరిగణించి చేనేతపై విధిస్తున్న పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్చేశారు. కేటీఆర్ రాసిన పోస్టు కార్డును స్ఫూర్తిగా తీసుకొని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, కేపీ వివేకానంద కూడా ప్రధానికి కార్డులు రాశారు.