హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-ప్రైడ్ స్కీమ్ లబ్ధిదారులకు వివిధ ప్రోత్సాహకాల కింద రూ.562 కోట్ల చెక్కులను ప్రదానం చేయనున్నారు.
మొత్తం 8 వేలమంది లబ్ధిదారులను ఈ ప్రోత్సాహకాలకు ఎంపిక చేశారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏటా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, టీ-ప్రైడ్ లబ్ధిదారులకు ప్రోత్సాహకాలను అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ పథకం కింద 58 వేల మందికిపైగా లబ్ధిదారులకు దాదాపు రూ.2,650 కోట్ల ప్రోత్సాహకాలను అందించారు.
ఈ ఏడాది ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా టీ-ప్రైడ్ పథకాన్ని ప్రవేశపెట్టి పరిశ్రమలను స్థాపించేవారికి గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు రాయితీలు కల్పిస్తున్నారు. దీంతో పరిశ్రమల స్థాపనకు ఆయా వర్గాల యువత పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. వారిలో ఉత్తమ పారిశ్రామికవేత్తలకు గురువారం అవార్డులు అందజేయనున్నారు.