KTR | బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న అత్మీయ సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేసే విధంగా పకా ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలపై అమలుకు మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి నేతృత్వంలో పది మందితో కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు. కమిటీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ ద్వారానే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన సమాచారాన్ని, అభిప్రాయాలను తీసుకుంటారన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు.
ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి శాసనసభ్యుడు అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీం ని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ టీం ద్వారా అటు పార్టీకి, ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు.
పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రతి భారత రాష్ట్ర సమితి కార్యకర్తను భాగస్వామిని చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలన్నారు. ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల లాంటి మెటీర్నియల్స్ను సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు.
పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీగా, ప్రభుత్వంగా ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడే ప్రజాప్రతినిధులను, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడుతాయని కేటీఆర్ వివరించారు.