హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ, ఈసారి కూడా అదే చరిత్రను పునరావృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. లోటుపాట్లు సవరించుకుంటే భవిష్యత్తు అంతా బీఆర్ఎస్దేనని చెప్పారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరసరించి కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు, ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు. అనంతరం జరిగిన లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. వాగ్దానాలను నిలుపుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉండదని విమర్శించారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. అధికారంలోకి వచ్చిన తెల్లారినుంచే హామీలను అమలు చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాలాయపన చేస్తున్నది. కాంగ్రెస్ నెల రోజుల పాలనా పోకడలే అందుకు సాక్ష్యం. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో అప్పుడే అసహనం ప్రారంభమైంది. హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఆ దిశగా బీఆర్ఎస్ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలి’ అని పిలుపునిచ్చారు.
రెండు నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశాలు
ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని కేటీఆర్ అన్నారు. ఉద్యమంలో గట్టిగా పోరాడిన చరిత్రను గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని చెప్పారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు.
పార్లమెంటు నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయని, త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రెండుమూడు నెలలకోసారి అన్ని స్థాయిల కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖమ్మం సహా ఒకటి రెండు చోట్ల తప్పితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరసరించలేదని చెప్పటానికి పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్యనే నిదర్శనమని కేటీఆర్ ఉదహరించారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతోపాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని వివరించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించి, సమీక్షించి ముందుకు సాగుదామని నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్నిస్థాయిల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని వివరించారు.
రాష్ట్ర ప్రతిష్ఠ బీఆర్ఎస్ బాధ్యత
ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్థిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందని కేటీఆర్ పేర్కొన్నారు. పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. ‘తెలంగాణ గళం బీఆర్ఎస్. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే. బీఆర్ఎస్ వేయబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం. తెలంగాణ సాధించిన ఘనతకు, వెలుగొందుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉన్నది. ఉద్యమ స్ఫూర్తిని, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం’ అని పిలపునిచ్చారు.
కేసీఆర్కు పనితనం తప్ప పగతనం రాదు: హరీశ్రావు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే గ్రూపుల తన్నులాట మొదలైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్లో మూడు గ్రూపులున్నాయి. అందులో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, రెండోది టీడీపీ కాంగ్రెస్, మూడోది నిజమైన కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినా భవిష్యత్తు అంతా గులాబీదే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కేసీఆర్ పాలనలో మేము కక్షసాధింపు చర్యలకు పాల్పడితే కాంగ్రెస్ నేతలు ఇవ్వాళ జైళ్లలో ఉండేవారు. కేసీఆర్ అభివృద్ధి గురించే ఆలోచించేవారు. వారికి పనితనం తప్ప పగతనం తెలియదు. కాంగ్రెస్ అన్నింటికీ 100 రోజుల డెడ్లైన్ పెట్టింది.
ఆ గడువు అయిపోయాక ప్రజలే కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసులు పెడతారు’ అని అన్నారు. తాము ఇక నుంచి పార్టీ శ్రేణుల దగ్గరికే వస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను బంగారు పల్లెంలో పెట్టి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీగా పార్లమెంటులో నామా నాగేశ్వర్రావు అడిగినన్ని ప్రశ్నలు మరే సభ్యుడు అడగలేదని, దీన్ని బట్టే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలపై ఉన్న ప్రేమ తెలిసిపోతున్నదని అన్నారు. బీఆర్ఎస్ లేకపోతే సులభంగా తెలంగాణకు అన్యాయం చేయవచ్చని కేంద్రమంత్రి కిషన్రెడ్డి భావిస్తున్నారని, అందుకే తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదని వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
మన కొమ్మలను మనమే నరుక్కున్నాం: వద్దిరాజు
బీఆర్ఎస్ చెట్టు కొమ్మలను మనమే నరుక్కున్నామని, చివరికి చెట్టే కూలిపోయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనం నాడిని పసిగట్టలేకపోయామని తెలిపారు. ఖమ్మం జిల్లా రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, నాయకుల మధ్య విబేధాలు ఎక్కువయ్యాయని మాజీ స్పీకర్ పోచారం చెప్పారు. విబేధాలు పకనపెట్టి లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వర్రావు, సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియా నాయక్, కందాళ ఉపేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పాల్గొన్నారు.