KTR | తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రంనాటి సంక్షోభ పరిస్థితులు తెలంగాణవ్యాప్తంగా నెలకొని ఉన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ముగ్గురు రైతుల నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం ముమ్మాటికీ ఈ చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని మండిపడ్డారు.
భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్ లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్ లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ముగ్గురు రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం కావడం, రేవంత్ సర్కారు మోసాలను, అబద్ధపు హామీల పేరిట చేసిన తీరని ద్రోహాన్ని అడుగడుగునా ఎత్తిచూపుతోందని అన్నారు. రుణమాఫీ పేరిట చేసిన నయవంచనకు తోడు, పెట్టుబడి సాయానికి పాతరేయడం, చివరికి యూరియాను కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథలా మారిందని అన్నారు.
కేవలం రెండేళ్ల కాలంలోనే దాదాపు 900 మంది రైతులు గుండెపగిలి బలవన్మరణాలకు పాల్పడినా ఈ సన్నాసి సర్కారుకు ఇప్పటికీ సోయి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్లు ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ఇవాళ మోగుతున్న ఈ మరణమృదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలారా.. దయచేసి ధైర్యం కోల్పోకండి. మరో మూడేళ్లు ఓపిక పట్టండని సూచించారు. ఈ వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్ ను గద్దెదించుదామని.. మన తెలంగాణలో వ్యవసాయరంగానికి మళ్లీ మంచిరోజులు తెచ్చుకుందామని అన్నారు.
Read More : అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య