KTR | 14లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జీవో 7ను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అని నిలదీశారు. కేసీఆర్ స్కీమ్లకే కాదు.. వైఎస్ఆర్ పథకాలకూ పాతరేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ రెండున్నరేళ్ల మీ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూల్చి క్షమించరాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా? రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దుచేసేలా మీరు చేస్తున్న కుట్ర భయంకరమైనది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ జీవో వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు, లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైంది. పిల్లల భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు మీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలు నీళ్లు జల్లుతున్నాయి. ఇప్పటికే గురుకుల వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చడంతో 142 మందికి పైగా చందమామల్లాంటి పిల్లలు తనువు చాలించారు. కనీసం సరైన భోజనం కూడా కల్పించలేని చేతకాని సర్కారు వల్ల ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రాజకీయాలకతీతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొనసాగించారు, విద్యార్థుల ఉన్నత చదువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలకు ఇప్పటికే గాలికొదిలేసి నాలుగు కోట్ల ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చివరికి గతంలో మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలుచేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గనిపించడం లేదా ?? ఆర్థిక స్థోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించే ఈ పథకాన్ని సమాధి చేసేలా విడుదల చేసిన జీవో 7 ముమ్మాటికీ ఫీజు రీయింబర్స్ మెంట్ ను ఎత్తేసేందుకు తెచ్చిన చీకటి జీవో మాత్రమే. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఈ జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకుని, విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను.
విద్యకోసం చేసే ఖర్చును ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా, బాధ్యతగా చూడాలే తప్ప, భారంగా భావించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న దారుణమైన నిర్ణయం వల్ల అత్యధికంగా నష్టపోయేది సమాజంలోని బడుగు, బలహీనవర్గాల పిల్లలే. రాష్ట్రవ్యాప్తంగా 2500కు పైగా నడుస్తున్న ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఒక్క పైసా చెల్లించకుండా రెండున్నరేళ్లుగా తీవ్ర వేధింపులకు చేశారు.. పైగా బాకీల చెల్లింపు విషయంలో వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరిట కొంతకాలం, ట్రస్ట్, టోకెన్ల పేరిట ఇంకొంత కాలం, కమిటీల పేరిట మరికొన్ని రోజులు మభ్యపెట్టారు. చివరికి అసలుకే ఎసరు తెచ్చిన మీ దివాళాకోరు విధానాన్ని చూసి విద్యార్థి లోకం తీవ్రంగా అసహ్యించుకుంటోంది . పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంవల్ల కళాశాలలు నడపలేక యాజమాన్యాలు బంద్ పాటిస్తే, మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విజిలెన్స్ దాడుల పేరిట కళాశాలలపై బెదిరింపులకు పాల్పడ్డారు. చివరికి 1207 కోట్ల విడుదల పేరిట ఇచ్చిన టోకెన్లకు నేటికీ దిక్కులేకుండా పోయింది. వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సిన నిధులకు రెండున్నరేళ్లుగా బ్రేకులు వేయడం వెనక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు స్పష్టంగా బయటపడింది.’ అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.
Read Also: Fee Reimbursement | ఇక నుంచి విద్యార్థులే ఫీజు చెల్లించాలి.. వారి ఖాతాకు రీయింబర్స్మెంట్ బదిలీ!
‘ గత 30 నెలల్లో మూడు పైసలు కూడా విడుదల చేయని మీ ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమవేస్తామంటే ఎవరు నమ్ముతారు. విశ్వసనీయత కోల్పోయిన మీ సర్కారు చెప్పే బూటకపు మాటలకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో జీరో వాల్యూ. 2026-27 విద్యాసంవత్సానికి తెచ్చిన మార్గదర్శకాలన్నీ.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసే మరణశాసనాలుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి కొర్రీల వల్ల, తమ పిల్లలకు కళాశాలల్లో కనీసం అడ్మిషన్స్ లభిస్తాయా అనే భయం పేద తల్లిదండ్రులను వెంటాడుతోంది. గత రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీల వల్ల కాలేజీల్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయి విద్యార్థులు పడుతున్న అవస్థలకు లెక్కే లేదు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల బారాన్ని మోపి, వారిని అప్పులు పాలు చేసే సర్కారు కుట్రలను ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాగే 10 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్నే ప్రభుత్వం నేటికీ చెప్పకపోవడం మీ నయవంచన విధానాలకు నిదర్శనం.
అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన గ్యారెంటీలు, 420 హామీల మాట దేవుడెరుగు, చివరికి ఉన్న పథకాలను కూడా ఊడగొట్టడం మీ రెండున్నరేళ్ల అసమర్థ పాలనకు నిదర్శనం. ఓవైపు 3.75 లక్షల కోట్ల అప్పులు చేసినా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలకు మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం కాకపోతే మరేంటి. ఇప్పటివరకు ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క గ్యారెంటినీ కూడా పూర్తిగా అమలుచేయకుండా ఇన్ని లక్షల కోట్ల సొమ్ము ఎటుపోతున్నట్టో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టి అన్నదాతల వెన్నువిరిచారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు చరిత్రలో ఏనాడూ చూడలేదు. రైతుబంధును ఎగ్గొట్టేందుకు పూటకో అడ్డదారులు తొక్కినట్టే, ఫీజుల పథకానికి మంగళం పాడేందుకు రకరకాల దొడ్డిదారులు వెతకడం, పేద విద్యార్థులకు వెన్నుపోటు పొడవడమే. ఇప్పటికే మీ దద్దమ్మ పాలనలో సకల సంక్షోభాలు చుట్టుముట్టి ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలు, తమ పిల్లల ఫీజుల బారాన్ని ఎలా మోస్తాయి.. యూరియా సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు యాప్ పేరిట నయా నాటకానికి తెరతీసినట్టే, ఫీజుల పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చీకటి జీవో ముసుగులో ఇంతటి నీచానికి ఒడిగట్టిన మీరు శాశ్వతంగా విద్యార్థుల దృష్టిలో ద్రోహిగానే మిగిలిపోతారు.
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా తెచ్చిన చీకటి జీఓను వెనక్కి తీసుకోవాలి. అప్పటివరకు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలో ఉన్న 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేద విద్యార్థులతో దండుకట్టి కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తాం.. ఇప్పటికే అన్నదాతల ఆందోళనలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో దగాపడ్డ విద్యార్థుల గర్జిస్తే మీరు, మంత్రులు రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి.’ అని కేటీఆర్ హెచ్చరించారు.