న్యూఢిల్లీ, జూలై 28 : దేశవ్యాప్తంగా టెలికాం సబ్స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. జూన్ నెలకుగాను దేశవ్యాప్తంగా 134.8 కోట్ల మంది టెలికాం సబ్స్ర్కైబర్లు ఉన్నట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దేశీయ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, జియో నెట్వర్క్లోకి కొత్తగా సబ్స్ర్కైబర్లు జతయ్యారని తెలిపింది. దీంట్లో ఎయిర్టెల్ నెట్వర్క్లోకి కొత్తగా 31.63 లక్షల మంది చేరారు. వీరిలో 29.89 లక్షల మంది మొబైల్ సబ్స్ర్కైబర్లు కాగా, 1.73 లక్షల ఫిక్స్డ్ లైన్ కనెక్షన్లు ఉన్నట్టు పేర్కొంది.
అలాగే రిలయన్స్ జియో లోకి 22.91 లక్షల సబ్స్ర్కైబర్లు చేరారు. వీరిలో 21.46 లక్షల మొబైల్ కస్టమర్లు కాగా, 1.44 లక్షల ఫిక్స్డ్ లైన్ సెగ్మెంట్నకు సంబంధించిన వారని తెలిపింది. మొత్తం సబ్స్ర్కైబర్లలో ఈ రెండు సంస్థలకు కలుపుకొని కొత్తగా 54.54 లక్షలు లేదా 87 శాతం ఉన్నారు. అలాగే వొడాఫోన్ ఐడియా నెట్వర్క్లోకి 1.63 లక్షల మంది చేరగా, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పరిధిలోకి 94 వేల మంది జతయ్యారు. కానీ, ఎంటీఎన్ఎల్ 11,284 మంది మొబైల్ సబ్స్ర్కైబర్లను కోల్పోయింది.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో జియో తన మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నది. జూన్ చివరి నాటికి వైర్లైన్ బ్రాడ్బ్యాండ్, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, యాక్టివ్ వైర్లెస్ సబ్స్ర్కైబర్లు భారీగా పెరిగినట్టు వెల్లడించింది. గత నెలలో కొత్తగా 1,78,546 నికర వైర్లెస్ సబ్స్ర్కైబర్లు చేరడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 3.29 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.