మా బాస్లు తెలంగాణ గల్లీల్లో ఉంటారు. ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇస్తే ఏమవుతుందో తెలుసా? వాళ్లు లేచి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, హామీలు ఇవ్వాలన్నా.. ఒకవేళ రోడ్డుపై తన్నుకుంటే పంచాయితీ తెగాలన్నా ఢిల్లీకే పోవాలి. అలాంటి గబ్బుగాళ్లు కేసీఆర్ను ఓడగొట్టాలంటూ లొల్లి చేస్తుండ్రు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీకి బానిసలు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ బానిసలకు మధ్యే పోటీ. పౌరుషం ఉన్న తెలంగాణ ప్రజలంతా ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలి.
-మంత్రి కేటీఆర్
నిజామాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తోమిన గబ్బు కాంగ్రెస్.. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నదని, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ నోటికి ఏదివస్తే అది వాగుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తిన ద్రోహి రైఫిల్రెడ్డి అంటూ రేవంత్ను విమర్శించారు. ‘రేవంత్రెడ్డి అనేటోడు తెలంగాణవాది కాదు.. తెలంగాణకు వ్యాధి’ అని అభివర్ణించారు. ‘సంచలన నాయకుడు కేసీఆర్ ఒకవైపు.. సంచులు మోసే దరిద్రుడు రేవంత్ మరోవైపు.. వాడితో మనం పోటీయా? థర్డ్ క్లాస్ క్రిమినల్.. దిక్కుమాలినోడు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అడ్డిమార్ గుడ్డి దెబ్బలా ఎంపీ అయినోడు ఇవాళ ఎగిరెగిరి పడుతున్నాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు చురకలంటించారు. ఢిల్లీకి గు లాం చేసే బీజేపీ, కాంగ్రెస్లను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ యన నిజామాబాద్ నగరంలో పర్యటించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, షకీల్, జీవన్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠల్రావు, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో కలిసి ఐటీ హబ్, న్యాక్ భవన్, అధునాతన వైకుంఠధామా లు, మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, మినీ ట్యాంక్బండ్లను ప్రారంభించారు. తొలుత మున్సిపల్ కార్మికులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించారు.
‘ఇక్కడో ఎంపీ (అర్వింద్) ఉన్నడు. చదువుకున్నడో లేదో! ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్లరగా మాట్లాడుతున్నడో మీరే చూస్తున్నారు. కేసీఆర్ వయసు వాళ్ల నాన్న వయసంత. మాకు బూతులు తిట్టుడు చాత కాదా? పెద్ద మనుషులను గౌరవించుకోవాలి. అది హిందూ సంప్రదాయం. నాగరికతకు చిహ్నం. 70 ఏండ్ల కేసీఆర్ను, రెండుసార్లు సీఎంగా ఉన్న, తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి కొట్లాడిన వ్యక్తిని పట్టుకుని ఏదేదో మాట్లాడుతుండు. భూమికి గింతున్నోడు కూడా నోటికొచ్చినట్టు ఒర్రుతుం డు. ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ గల్లంతు చేయడం ఖాయం. తెల్లారి లేస్తే చిల్లర పంచాయితీలు. హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టుడు, పిచ్చి మాటలు మినహా వారికి మంచి మాటలు రావు’ అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. వందల కోట్లు అభివృద్ధి జరుగుతుంటే చిత్తశుద్ధి ఉన్నోడైతే అభివృద్ధి కార్యక్రమాలకు రాడా? ముఖం లేదా? అని ఎంపీ అర్వింద్ను నిలదీశారు. నిజామాబాద్లో ఆయనతో నయాపైసా పని జరుగలేదని, మోదీ ఒక్క పైసా ఇయ్యలేదని వ్యాఖ్యానించారు. అందుకే ముఖం చాటేసి..అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. 4 వందల రూపాయలకు సిలిండర్ ధర పెరిగితే 400 తిట్లు తిట్టిన మోదీ ఇప్పుడు రూ.1200 చేసిండని ఫైర్అయ్యారు. బీజేపోళ్లకు వచ్చే ఎన్నికల్లో గుండుకొట్టాలని, డిపాజిట్లు గల్లంతు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
2014లో తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాడే మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిండు. ఎన్నికలప్పుడు మోడీ ఏమన్నారో తెలుసా. ‘జన్ధన్ ఖాతా ఖోలో… ధన్ధన్ పంద్రాలాఖ్ దేతా’ అన్నారు. బోగస్ మాటలు.. బక్వాస్ ముచ్చట్లు తప్ప ఎవ్వరికైనా రూ.15 లక్షలు మీ అకౌంట్లో జమ అయ్యాయా? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చిరా?. తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా?.. ఎంపీ అర్వింద్కు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముఖం ఉందా?
-మంత్రి కేటీఆర్
‘కాంగ్రెస్ పార్టీ ఆకాశం మీది నుంచి వచ్చిం దా. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటున్నారు. వీళ్లకు పదిసార్లు ఇచ్చాం. యాభై ఏండ్లు వీళ్లే కదా మనల్ని సతాయించింది. తాగు, సాగునీరు, కరెంట్, ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా సావకొట్టింది వీళ్లే కదా? ఇప్పుడు వాళ్లే వచ్చి మాట్లాడుతున్నారు.’ అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘మీకో కథ చెప్పాలె. ఓ చిన్నపిల్లగాడు ఉండె. చదువు సంధ్యలేదు. లంగ సోపతి, దోస్తానాలు. దిక్కుమాలిన అలవాట్లు. 15 ఏండ్లకు పెరిగిండు. ఇంట్లో వాళ్ల నాన్న జేబులో నుంచి దొంగతనం చేస్తుంటే అమ్మ చూసి తిడితే అడ్డం వచ్చిన అమ్మను రోకలిబండతో కొట్టి చంపిండు. నాయన ఉరికొచ్చిండు. వంగపెట్టి గుద్దిండు. అదే రోకలితో నాన్నను కొట్టిండు. నాన్న సచ్చిండు. పోలీసోళ్లు జైల్లో పెట్టిండ్రు. శిక్షకు జడ్జ్జిగారి వద్దకు వచ్చిండ్రు. సొంత అమ్మానాన్నలను చంపినవ్. నీకు ఏం శిక్ష వేయాలన్నాడట. అయ్యా.. నేను అనాథను విడిచిపెట్టు అన్నడంట ఆ లంగ పోరడు. ఇట్లనే కాంగ్రెస్ తీరుకూడా ఉన్నది’ అని చమత్కరించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని.. ఇప్పు డు హంతకుడే సంతాపం తెలిపినట్టు కాంగ్రెస్ తీరు ఉన్నదని దుయ్యబట్టారు.
‘ఎన్నికల ముందు కొంతమంది గంగిరెద్దుల్లా వస్తారు. చాలా చెప్తారు. మీ అందరికీ ఒకటే కోరుతున్న. ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. హైదాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చేటప్పుడు చూస్తుంటే ఎటు చూసినా నిండుకుండల్లా చెరువులు. ఖాళీ లేకుండా నాట్లు వేసిన పొలాలు. అంతా ఆకుపచ్చగా కనిపిస్తున్నది. భూమాత ఆకుపచ్చ చీర కట్టినట్టుగా ఉన్నది. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి వర్గం సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నదని, ఆడబిడ్డలు ఆలోచన చేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో పింఛన్ రూ.200 మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు రూ.2 వేలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ను పది రెట్లు పెంచి ఇస్తున్న ఏకైక సర్కారు తమదేనని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వం ఎవ్వరినీ తక్కువ చేయలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణకు పరిశ్రమలు, ఐటీ హబ్లు వస్తున్నాయని పేర్కొన్నారు. మరి 60 ఏండ్లలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు ఇట్లుంటే కొంత మందికి కడుపులో ఆగమాగం అవుతున్నదని, తిన్నది అరగక ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘తెలంగాణకు 3 గంటల కరెంట్ చాలట. 3 ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ అంటుండు. మూడు గంటల కాంగ్రెస్ కావాల్నా..? మూడు పంటల బీఆర్ఎస్ కావాల్నా..? మతం మంటల బీజేపీ కావాల్నా..? మీరే తేల్చుకోవాలి.’ అని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ రైతు భవిష్యత్తు వైపు ఆశావహంతో చూస్తున్నాడని, కుంభకోణాలతో కుంభమేళా చేసే కాంగ్రెస్ కావాల్నా? మేలు చేసే బీఆర్ఎస్ కావాల్నా? ఆలోచన చెయ్యాలె.’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో బీడీ పింఛన్ ఉందా? ఈరోజు బీడీ కార్మికులకే కాదు.. ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు.. చివరకు డయాలసిస్ రోగులకు కూడా పింఛన్ అందుతున్నది. మొన్ననే సోదరి కవిత వచ్చి బీడీ టేకేదార్లకు కూడా పింఛన్ ఇవ్వాలని కోరితే వెంటనే ప్రకటించిన నాయకుడు కేసీఆర్. చెప్పుకొంటూపోతే ఏ ఒక్క వర్గాన్నీ వదిలి పెట్టకుండా పసిగుడ్డు నుంచి చివరి దశలో ఉన్న పెద్ద మనుషుల వరకు అందరికీ ఏదో రకంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకొంటున్నది.
-మంత్రి కేటీఆర్
దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి కే తారక రామారావు అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ జనరంజక పాలనలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. ఇందులో కేటీఆర్ భాగస్వామ్యం ఎంతో ఉన్నదని చెప్పారు. దేశ, విదేశాల్లోని పారిశ్రామికవేత్తలను ఒప్పించి రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారని, 16 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించారని పేర్కొన్నారు.
నిజామాబాద్ అభివృద్ధి ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరిందంటే అందుకు ప్రధాన కార ణం మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ఆశీస్సులేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణే ష్ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ యువత ఉద్యోగాల కోసం ఇక్కడ్నుంచి పుణె, బెంగళూర్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. నిత్యం ప్రజల ఆలోచనలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం ద్వారానే నిజామాబాద్ అత్యద్భుతం గా ఆవిష్కృతమైందని తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత, మహేశ్ బిగాల సహకారంతో జాబ్ మేళా నిర్వహించి ఐటీ హబ్లో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్లు విఠల్రావు, దఫేదార్ శోభ, టీఎస్డబ్ల్యూఎఫ్సీ చైర్మన్ ఆకుల లలిత, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలో నిర్మించిన ఐటీ టవర్లో బాసర ట్రిపుల్ ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రూపొందించిన పలు ప్రయోగాలను పరిశీలించారు. అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఆయా ప్రయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ ఐటీకి సెంటర్ను ఏర్పాటు చేశామని, దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. అంతకుముందు ఐటీ హబ్లోని సరస్వతీ అమ్మవారికి మంత్రి కేటీఆర్ పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీకి అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
ఒకనాడు నెర్రెలుబారిన నేల. నెత్తురు కారిన నేల. సామాజిక అసమానతలతో అతలాకుతలమైన తెలంగాణ. సమైక్యపాలనలో ఆగమైన తెలంగాణ. ఇప్పుడు తొమ్మిదేండ్లలో ఎక్కడ్నుంచి ఎక్కడి దాకా వచ్చింది. 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడుల నుంచి ఇప్పుడు ఏకంగా మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నులకు వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కి నెట్టింది.
-మంత్రి కేటీఆర్
నిజామాబాద్లోని దుబ్బ, అర్సపల్లి, వర్ని రోడ్డులో రూ.15.50 కోట్లతో అద్భుతమైన వైకుంఠధామాలు కట్టించారని, ఇలాంటి రాష్ట్రంలో ఎక్కడా లేవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో పెద్ద వాళ్లకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని, దాని కంటే ఈ వైకుంఠధామాలు బాగున్నాయని ప్రశంసించారు. దీని పూర్తి క్రెడిట్ గణేశ్ బిగాలకే దక్కుతుందని చెప్పారు. అలాగే, బిగాల ప్రత్యేక శ్రద్ధపెట్టి మున్సిపల్ కార్యాలయాన్ని సకల సౌకర్యాలతో సుందరంగా నిర్మించారని ప్రశంసించారు. నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతోపాటు ఆడపడుచులకు చీరెలు, మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు చీరలుపెట్టి భోజనాలు, దీపావళి రోజు హమాలీలకు కొత్త బట్టలు పెడుతూ బిగాల వినూత్న సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. ‘గత ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేను 27వేల మెజారిటీతో గెలిపించారని.. అది సరిపోదని.. వచ్చే ఎన్నికల్లో బిగాలను 55 వేల మెజార్టీతో గెలిపించాల’ని ప్రజలను కోరారు. నగరంలోని 60వ డివిజన్లో అంతర్గత రోడ్లకు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.